రైతు బాంధవుడు కేసీఆర్ .. ఏటికేడు పెరుగుతోన్న కేటాయింపులు
హైదరాబాద్ : స్వయంగా రైతు అయిన సీఎం కేసీఆర్ అన్నదాత పాలిట బాంధవుడు అవుతున్నారు. ఏటికేడు రైతు సంక్షేమం కోసం బడ్జెట్ పెంచుతున్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతుబంధు పథకం ప్రవేశపెట్టి .. అన్నివర్గాల నుంచి మన్ననలు అందుకుంటున్నారు. సబ్బండవర్గాలు సీఎం కేసీఆర్ కు జేజేలు పలుకుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయమే ఇందుకు నిదర్శనం
ఎకరాకు రూ.8 నుంచి రూ.10 వేలు
గతేడాది ప్రవేశపెట్టిన రైతుబంధు పథకానికి రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి ఆదరణ వచ్చింది. అంతేకాదు పంట వేసే ముందు విత్తనాలు, ఎరువులు ... దుక్కి దున్నేందుకు ఈ ఆర్థికసాయం రైతన్నకు ఉపకరించింది. గతేడాది ఎకరానికి రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.8 వేలు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.10 వేలు అందించనున్నారు. ఇందుకోసం బడ్జెట్ లో రూ.12 వేల కోట్లు కేటాయించారు సీఎం కేసీఆర్.
పెరుగుతున్న పెట్టుబడి వ్యయం
తొలి ఏడాది ఎకరానికి రూ.4 వేలు ఇచ్చిన సర్కార్ .. రెండో ఏడాది రూ. 5 వేలు చేసింది. వచ్చే ఏడాది పెంచుతుందా లేదా యథాతథాంగా కొనసాగుతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది. రైతుల సంక్షేమం కోరి పెంచితే మాత్రం రికార్డే అవుతోంది. అలాగే బడ్జెట్ లో కేటాయింపులు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఆదర్శంగా నిలిచిన పథకం
కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ పథకం ఎలా అమలు చేస్తున్నారనే అంశాన్ని పరిశీలించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా వచ్చారు. రాష్ట్రంలో అమలవుతోన్న పథకంపై ప్రధాని మోదీ .. నీతి అయోగ్, ఆర్థిక నిపుణులు, శాస్త్రవేత్తలు సైతం అభినందించారు. ఈ పథకం అమలుతీరుపై వారు ఆశ్చర్యపోయారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో రైతు బంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ పథకం ప్రవేశపెట్టారు.
కొండంత రైతు బీమా
అదేవిధంగా రైత బీమా కూడా అన్నదాతకు ఆర్థికభరోసా కల్పిస్తోంది. రైతు తరఫున బీమాను ప్రభుత్వం కడుతోంది. ఒకవేళ దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ రూ.5 లక్షలు అందజేస్తోంది. గతేడాది రైతు కుటుంబాలకు 250 కోట్లు అందజేసినట్టు అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు. ఈ ఏడాది కూడా రూ.650 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు