ఈసారి తెలంగాణ బడ్జెట్ ఎంత..? ఏయే రంగాలకే కేటాయింపులు ఎలా..? వివరాలివే..?
తెలంగాణ 2020 బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించి.. సభను ఎన్నిరోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చ జరపాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే బడ్జెట్ ప్రసంగం కాపీలను గవర్నర్కు సీఎం కేసీఆర్ అందజేశారు. జాతీయ జనాభా పట్టిక చేపట్టబోమని గవర్నర్కు సీఎం కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. సీఏఏకి వ్యతిరేకంగా సభలో తీర్మానం చేసే అవకాశం కూడా ఉంది.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితోపాటు కరోనా వైరస్ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలపై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నా.. తెలంగాణలో సమర్ధమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2019-2020 బడ్జెట్ లక్ష 46 వేల 492.3 కోట్లుగా ఉంది. రెవెన్యూ వ్యయం లక్షా 11 వేల 55 కోట్లు కాగా.. మూలధనం వ్యయం 17 వేల 274.67 కోట్లుగా చూపించారు. ఈ సారి బడ్జెట్ ఏ మేరకు పెరుగుతుందో చూడాలి. కేంద్ర ప్రభుత్వం సంస్కరణలతో ముందుకెళుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఏయే అంశాలను ప్రాధాన్య అంశాలుగా తీసుకోనుందో తెలియాల్సి ఉంది.
గత బడ్జెట్లో రైతుబంధు పథకానికి రూ.12 వేల కోట్లు, పంట రుణాల మాఫీకి రూ.6 వేల కోట్లు, గ్రామ పంచాయతీలకు రూ. 2,714 కోట్లు కేటాయింపు, మున్సిపాలిటీలకు రూ.1,764 కోట్లు, ఆరోగ్యశ్రీకి ఏడాదికి రూ.1,336 కోట్లు, రైతుబీమా ప్రీమియం చెల్లింపునకు రూ.1,137 కోట్లు, ఆసరా పింఛన్ల కోసం రూ.9,402 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సారి కేటాయింపులు పెంచుతారా..? తగ్గిస్తారా అన్నది బడ్జెట్లో తేలిపోనుంది.