కొత్త సచివాలయ నమూనాకు కేసీఆర్ కేబినెట్ ఆమోదం: స్థానికులకే ఉద్యోగాలు, కీలక నిర్ణయాలివే
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం రాత్రి సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించేలా నూతన విధానానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
స్థానిక యువతకే ప్రాధాన్యత
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో నెలకొల్పుతున్న పరిశ్రమల్లో స్థానిక యువతకు ఎక్కువ ఉద్యోగాలు దొరికేలా విధానం రూపొందించాలని పరిశ్రమల శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కసరత్తు చేసి ముసాయిదాను పరిశ్రమల శాఖ రూపొందించింది.
50-80 శాతం వరకు స్థానికులకే ఉద్యోగాలు..
పరిశ్రమల శాఖ సమర్పించిన ముసాయిదాపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. పరిశ్రమల్లో ఉన్న మానవ వనరుల కేటాయింపులను రెండు విభాగాలుగా విభజిస్తూ ప్రోత్సహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. మొదటి విభాగంలో పాక్షిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో స్థానికుల్లో 70 శాతం అవకాశాలు ఇవ్వనున్నారు. నైపుణ్యం కలిగిన మానవ నరుల్లో స్థానికులకు 50 శాతం ఉద్యోగాలు కేటాయించనున్నారు. రెండో విభాగంలో పాక్షిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో స్థానికులకు 80 శాతం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో స్థానికులకు 60 శాతం ఉద్యోగాలు కేటాయించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.
హైదరాబాద్ నలువైపులా పరిశ్రమలు
స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక హైదరాబాద్లో ఐటీ పరిశ్రమలు ఒకే చోట కాకుండా నగరం నలువైపులా విస్తరించాలని కేబినెట్ అభిప్రాయపడింది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగితా చోట్ల కంపెనీలు పెట్టే వారికీ అదనపు ప్రోత్సహకాలు ఇవ్వాలని నిర్ణయించింది.
కరోనా కట్టడికి 100 కోట్లు
ఇక హైదరాబాద్ గ్రిడ్ పాలసీకి కూడా కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ప్రోత్సహించడం, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీకి ఆమోదం తెలిపింది. ప్రత్యేక రాయితీలతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించాలని నిర్ణయించింది. కాగా, కరోనా కట్టడికి రూ. 100 కోట్లను కేటాయించాలని నిర్ణయించింది. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తప్పవని తేల్చి చెప్పింది.
Recommended Video
నూతన సచివాలయ భవన నమూనాకు ఆమోదం
ఇది ఇలావుండగా, తాజా కేబినెట్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. సచివాలయం నూతన భవన సముదాయం నిర్మాణానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. తూర్పు అభిముఖంగా ఏడు అంతస్తుల్లో కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్లకు ఆమోద ముద్ర వేసింది. చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్లు ఆస్కార్, పొన్ని ఈ భవన నమూనాలను రూపొందించారు.