రేపు తెలంగాణ మంత్రివర్గం కీలక భేటీ: కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చర్చ: మోడీ సర్కార్పై దండయాత్ర
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం కుదిరింది. పలు కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు.. ఇతర ప్రతిపాదనలపై మంత్రులు చర్చించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని నియంత్రించడానికి చేపట్టాల్సిన చర్యలు ఈ భేటీ సందర్భంగా ప్రస్తావనకు రానున్నాయి. కొత్త పెట్టుబడులు,రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైనా మంత్రులు చర్చిస్తారని తెలుస్తోంది.
సోమవారం ప్రగతిభవన్లో..
సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి అధ్యక్షత వహిస్తారు. ఇందులో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఇదివరకే అన్ని శాఖలు, విభాగాధిపతులకు సర్కులర్ జారీ చేసింది. ఫిబ్రవరి-మార్చి నెలల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నందున.. దీనికి అవసరమైన కసరత్తును మొదలు పెట్టాలని నిర్ణయించింది. బడ్జెట్ ప్రతిపాదనలు, అంచనా వంటి విషయాలపై కేసీఆర్.. మంత్రులతో చర్చిస్తారని తెలుస్తోంది.
థర్డ్ఫ్రంట్పై..
కొద్దిరోజుల కిందటే పలువురు జాతీయ స్థాయి నాయకులు హైదరాబాద్లో కేసీఆర్ను కలిసిన విషయం తెలిసిందే. తొలుత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, డీ రాజా, ప్రకాష్ కారత్ వంటి సీనియర్ వామపక్ష నాయకులు కేసీఆర్తో భేటీ అయ్యారు. ఆ తరువాత బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత తేజస్వి యాదవ్ సైతం ఆయనను కలుసుకున్నారు. దేశ రాజకీయాలపై వారి మధ్య చర్చలు సాగాయి. థర్డ్ ఫ్రంట్ ఏర్పాట్లను కేసీఆర్ ముమ్మరం చేశారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి.
భేటీ సారాంశాన్ని మంత్రులకు..
ఆయా నాయకులతో సాగించిన చర్చలు, సంభాషణల సారాంశాన్ని కేసీఆర్.. మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించే అవకాశాలు లేకపోలేదు. దేశంలో నెలకొన్న రాజకీయ స్థితిగతులు, థర్డ్ ఫ్రంట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం గురించి కేసీఆర్..తన కేబినెట్ సహచరులతో పంచుకుంటారని అంటున్నారు. భవిష్యత్తులో తాను పూర్తిస్థాయి దేశ రాజకీయాలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి వస్తే.. ప్రత్యామ్నాయం ఏమిటనే విషయంపైనా తన అభిప్రాయాన్ని కేసీఆర్.. మంత్రులకు తెలియజేస్తారని చెబుతున్నారు.
కోవిడ్ను నియంత్రించడంపై..
తెలంగాణలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొత్త కేసులు వందల సంఖ్యలో పుట్టుకొస్తోన్నాయి. దీనికి ఒమిక్రాన్ వేరియంట్ కూడా తోడైంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం పలు ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. నైట్ కర్ఫ్యూలను అమలుచేస్తోంది. పాఠశాలలు, విద్యాసంస్థలకు ఇచ్చిన సంక్రాంతి సెలవులను కూడా పొడిగించింది. ఈ సెలవులను ఆ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఈ పరిణామాల మధ్య కోవిడ్ నియంత్రణ చర్యలను మరింత కట్టుదిట్టం చేయడంపై మంత్రివర్గం చర్చిస్తుందని అంటున్నారు.
ధాన్యం కొనుగోళ్లపై..
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ మధ్య దుమారానికి కారణమైంది. రెండు పార్టీలు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ సైతం రోడ్డెక్కారు. ధర్నా చౌక్లో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కేంద్రంపై దాడిని మరింత తీవ్రతరం చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దీనికి అనుసరించాల్సిన వ్యూహాలపైనా కేసీఆర్ మంత్రులతో చర్చించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.