KCR: కేంద్రంతో ఢీ: అసెంబ్లీలో తీర్మానానికి కేసీఆర్ సర్కార్ రెడీ: ఆ చట్టానికి తెలంగాణలో బ్రేక్..!
హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో మరోసారి కయ్యానికి కాలు దువ్వింది తెలంగాణ ప్రభుత్వం. నరేంద్ర మోడీ సర్కార్ పట్ల ముందు నుంచీ వ్యతిరేక భావాన్ని ప్రదర్శిస్తూ వస్తోన్న కేసీఆర్ సర్కార్.. మరోసారి అలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పౌరసత్వ సవరణ చట్టాన్ని తెలంగాణ బ్రేక్ వేయనుంది. దీనిపై అసెంబ్లీలో కూడా ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది.
కేసీఆర్ బర్త్డే పిక్: 2600 మందితో..120 అడుగుల ఎత్తు నుంచి క్లిక్.. వైరల్!
ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో..
దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నాలుగు రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలను చేశాయి. కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు పౌరసత్వ సవరణ చట్టాన్ని తాము అమలు చేయట్లేదని తేటతెల్లం చేశాయి. ఇదే జాబితాలో తెలంగాణ కూడా చేరనుంది. తమ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయాలా? వద్దా? అనే విషయంపై కేసీఆర్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో ఈ చట్టాన్ని అమలు చేయకూడదని నిర్ణయించింది. ఇదే విషయంపై అసెంబ్లీలో ఓ తీర్మానం చేయడానికి కసరత్తు ఆరంభించింది.
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం..
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్లో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని కూడా నిర్ణయించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడం వల్ల తెలంగాణ సంభవించే పరిణామాలను కూలంకషంగా వివరిస్తూ ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని మంత్రివర్గం తీర్మానించింది.
మతాలవారీగా ప్రజలను విడగొట్టడం పట్ల..
పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడం వల్ల మతాలవారీగా ప్రజలను విభజించినట్టవుతుందని తెలంగాణ మంత్రివర్గ సమావేశం అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది. కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో కలిసి ఉమ్మడిగా, న్యాయపరంగా పోరాడే అవకాశాలను కూడా పరిశీలించింది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసే అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ముస్లింల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని..
తెలంగాణలో ముస్లింల జనాభా అధికమే. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ముస్లింల పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికలు ఎదురైన ప్రతిసారీ ముస్లింలు టీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. 2014, 2018 అసెంబ్లీ మధ్యంతరంతో పాటు ఇటీవలే ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకు మొత్తం టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపిందని, అందువల్లే భారీ మెజారిటీని సాధించిందనే అంటున్నారు.
పార్టీకి అండగా ఉంటోన్న వారి కోసం..
ఈ పరిస్థితుల్లో ముస్లింల మనోభావాలు, వారికి ఇబ్బంది కలిగించే ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకోకూడదనే అభిప్రాయం మంత్రివర్గ సమావేశంలో వ్యక్తమైనట్లు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరికి దిగడానికి కూడా వెనుకాడకూడదనే దృఢ సంకల్పం కేసీఆర్ సర్కార్లో కనిపిస్తోందని అంటున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన అనంతరం కేసీఆర్ రాజకీయంగా కీలక నిర్ణయాలను కూడా తీసుకోవచ్చనీ తెలుస్తోంది.