ఫిబ్రవరిలో మంత్రివర్గ విస్తరణ? ఇద్దరు ఔట్.. ఇద్దరు ఇన్, మహిళలకే ఛాన్స్!?
హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గంలో త్వరలో మార్పులు, చేర్పులు జరుగనున్నట్లు తెలుస్తోంది. 2015లో చివరిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రి వర్గంలో మార్పులు చేశారు. ఆ తరువాత ఇప్పటివరకు చేయలేదు.
15 శాతం కోటా ప్రకారం తెలంగాణ మంత్రి వర్గంలో 17 మందికే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం కొత్త వారిని తీసుకోవడానికి ఛాన్సే లేదు. కొత్తగా ఎవరిని తీసుకోవాలన్నా.. ఇప్పుడున్న పదిహేడు మందిలో ఎవరో ఒకరిని తప్పించాల్సి వస్తుంది.
కడియం శ్రీహరే లాస్ట్...
2015లో చివరిసారిగా జరిగిన మార్పు తప్పించి ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ తన మంత్రివర్గంలో మార్పులు చేయలేదు. అప్పట్లో రాజయ్యను తప్పించి కడియం శ్రీహరిని క్యాబినెట్లోకి తీసుకున్నారు. అప్పట్నించి అదే మంత్రివర్గం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ తన క్యాబినెట్లో తప్పకుండా మహిళలకు స్థానం కల్పిస్తారని అప్పట్లో అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తొలి తెలంగాణ మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు దక్కలేదు.
మహిళలకు ప్రతినిధ్యం లేకుండా...
ఇటీవల హైదరాబాద్లో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సదస్సు సందర్భంగా కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. దీనిపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. మంత్రి వర్గంలో మహిళలకు ప్రాతినధ్యం ఇవ్వకుండా 2019లో సాధారణ ఎన్నికలకు వెళ్లడం అంత శ్రేయస్కరం కాదనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్ళీ మంత్రివర్గంలో మార్పు అంశం తెరపైకి వచ్చింది.
ఎవరు ఔట్, ఎవరు ఇన్?
ఒకవేళ మంత్రివర్గంలో మార్పులు చేస్తే... ఎవరిని తప్పిస్తారనే సందేహం అందరిలోనూ కదలాడుతుంది. ఈ కోణంలో తరచిచూస్తే.. మంత్రి చందూలాల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కారణం ఆయన అనారోగ్యంతో ఉండడం. మంత్రి పదవి చేపట్టిన కొన్ని రోజులకే చందూలాల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవలసి వచ్చింది. తర్వాత కాస్త కోలుకున్నా.. ఆయన ఆరోగ్య పరిస్థితి అంతగా సహకరించడం లేదు. దీంతో మంత్రి చందూలాల్ ఇంటికే పరిమితం అయ్యారు.
మహిళలకు అవకాశం ఇస్తారా?
మంత్రివర్గం నుంచి మంత్రి చందూలాల్ను గనక తప్పించేటట్లయితే ఆయన స్థానంలో కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తారనే విషయం హాట్ టాపిక్గా మారింది. చందూలాల్ని తప్పిస్తే అదే సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈసారైనా మహిళకు స్థానం కల్పించాలనుకుంటే, గిరిజన సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధుల్లో రేఖానాయక్, కోవా లక్ష్మి ఉన్నారు. వీరిలో ఒకరికి అవకాశం రావచ్చని చెబుతున్నారు.
మేడారం జాతర వరకు ఆగి...
మరోవైపు మంత్రివర్గ విస్తరణకు జనవరి నెలాఖరు వరకు మంచిరోజులు లేవని అంటున్నారు. ఆ తరువాత మేడారం జాతర ఎలాగూ వస్తుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ జాతర జరుగుతుందట. మంత్రి చందూలాల్ సొంత నియోజకవర్గం అయిన ములుగులోనే ఉంటుంది మేడారం. తెలంగాణలోనే అతిపెద్ద జాతర అయిన మేడారానికి సంబంధించిన సమీక్ష కూడా మంత్రి చందూలాల్ తన ఇంట్లోనే నిర్వహించారు. అనారోగ్యం దృష్ట్యా ఇక ఆయన చొరవగా బయటికి వచ్చి ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఈ జాతర జరిగే వరకు ఆగి, ఆ తరువాత చందూలాల్ను తప్పించి ఆయన స్థానంలో మరొకరికి మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారని చెప్పుకుంటున్నారు.