వారు వస్తారు..పదవులు ఇస్తారు, అప్పుడే క్యాబినెట్ విస్తరణ: టిఆర్యస్ వ్యూహం తెలిస్తే...!
తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ ఎందుకు ఆగింది. కెసిఆర్ వ్యూహం ఏంటి. ముఖ్యమంత్రిగా కేసిఆర్ తో పాటుగా రెవిన్యూ మంత్రిగా వ్యవహరించిన మహ్మద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేసారు. ఆయనకు హోం మంత్రి పదవి ఇచ్చారు. ఇక, ఎవరికీ మంత్రులుగా అవకాశం ఇవ్వలేదు. దీని పై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, కేసీఆర్ మాత్రం పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పోటీ లేని ధీటైన ప్రభుత్వం గా ఏర్పాటు చేయాలనే సంకల్పం తో ముందుకు వెళ్తున్నారు. అందు కోసం కేసీఆర్ వేస్తున్న అడుగులు ఆసక్తి కరంగా మారాయి..
సీనియర్లకు చెక్ తప్పదా..
కేసీఆర్ తన క్యాబినెట్ విస్తరణ చేయాలంటే కొన్నింటిని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. అందులో భాగంగా..కాంగ్రెస్ ఎమ్మెల్సీలను పార్టీలోకి ఆహ్వానించి..శాసనమండలి లో కాంగ్రెస్ కు గుర్తింపు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ నే ఉన్నారు. ఎమ్మెల్సీ స్థానాలు సైతం పెద్ద సంఖ్యలో ఖాళీ అవుతున్న విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. ఇవి ఎన్నికల్లో ఓడిన వారికో...పార్టీ నేతలకో కాదు. వలస వచ్చే వారికి ఆఫర్ ఇచ్చేందుకు వినియోగించుకోనున్నారు. ఇక, కేసిఆర్ కోటరీ కాంగ్రెస్ - టిడిపి నుండి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి పై ఆకర్ష్ మంత్రం వేస్తున్నారు. వారు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయక ముందే తమ వైపు తిప్పుకోవాలనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. వారికి పార్టీలో..ప్రభుత్వంలో ప్రాధా న్యత ఇవ్వటం ద్వారా నామ మాత్రపు ప్రతిపక్షం తో తెలంగాణ శాసనసభను పూర్తిగా గులాబీ మయం చేయాలనే పట్టుదల తో ముందుకు వెళ్తున్నారు. ఇందు కోసం సీనియర్లకు ప్రభుత్వంలో ప్రాధాన్యత లేకపోయినా... నామినేటెడ్ పోస్టుల ద్వారా క్యాబినెట్ హోదా ఇప్పించాలనేది వారి ఆలోచనగా తెలుస్తోంది. ఇద్దరు సీనియర్ మంత్రులను లోక్సభ కు పోటీ చేయించాలనే ఆలోచన పైనా చర్చలు సాగుతున్నట్లు సమాచారం.
వలస దారులకు పదవులు..
కాంగ్రెస్ - టిడిపి నుండి గెలిచి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే టిఆర్యస్ లో చేరే వారికి క్యాబినెట్ లో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం కాంగ్రెస్ - టిడిపి ల్లో సీనియర్లు టిఆర్యస్ కు వస్తేనే వారికి ప్రాదాన్యత ఇస్తామని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి గెలిచిన సండ్ర వెం కట వీరయ్య టిడిపిని వీడి టీఆర్యస్ లో చేరితే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. సండ్ర ఓటు కు నోటు కేసులో కూడా ఉండటంతో..ఆయన టీఆర్యస్ లో చేరటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నుండి గెలిచిన ఓ మహిళా నేతను సైతం టీఆర్యస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ మహిళా నేత భర్త గతంలో తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తే. ఆ మహిళా ఎమ్మెల్యే టీఆర్యస్ లోకి వస్తే మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. ఇక, ఆ మహిళా నేత కుమారుడికి లోక్సభ సీటు సైతం ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో పూర్తిగా పట్టు సాధించటానికి ఈ అవకాశం ఉపయోగించుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కేటిఆర్ కు ఇబ్బంది లేకుండా..అంతా గులాబీ మయం..
ఇప్పటికే కేటిఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కల్పించి ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్..భవిష్యత్ రాజకీయాల ను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణ లో కీలకంగా ఉన్న టిడిపి దాదాపు ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక, కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవటం ద్వారా రానున్న కాలంలో..ప్రతిపక్షం ఎక్కడా బలంగా ప్రభుత్వం పై గళం విప్పే శక్తి లేకుండా చేయాలనేది వారి ఆలోచన. ఇక, కాలం కలిసి వచ్చి..తాను జాతీయ రాజకీయాల్లో పూర్తి సమయం కేటాయించాల్సి వస్తే.. కేటిఆర్ కు ప్రతిపక్షాల నుండి..సొంత పార్టీ నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా రూట్ క్లియర్ చేయటానికి కేసీఆర్ జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు.