TS Cabinet: రైతులకు గుడ్ న్యూస్-అనాథ పిల్లలు,మెడికల్ కాలేజీలు,సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులపై కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లోని ప్రగతి భవన్లో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా పరిస్థితులు,కరోనా కారణంగా అనాథలైన పిల్లలు,మెడికల్ కాలేజీలు,వ్యాక్సినేషన్,దళిత బంధు,చేనేత భీమా తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఇప్పటివరకూ బయటకు వెల్లడైన వివరాల ప్రకారం రైతు రుణమాఫీపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
అలాగే రాష్ట్రంలోని అనాథ పిల్లలు,అనాథ శరణాలయాల సమస్యల పరిష్కారం దిశగా,కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీలు,సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సత్వర నిర్మాణం దిశగా చర్యలపై చర్చించారు.
రైతులకు గుడ్ న్యూస్
కేబినెట్ భేటీలో రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకున్నారు. అగస్టు 15 నుంచి రూ.50వేలు వరకు పంట రుణాలను మాఫీలను పూర్తిగా మాఫీ చేయాలని నిర్ణయించింది. సమావేశంలో ఇప్పటివరకూ చేసిన పంట రుణమాఫీ వివరాలను ఆర్థిక శాఖ కేబినెట్ ముందు ఉంచింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో, గత రెండేళ్లుగా రూ. 25,000 వరకు ఉన్న పంట రుణాలను మాత్రమే మాఫీ చేశారు. ఆగస్టు కేబినెట్ తాజా నిర్ణయంతో 6 లక్షల మంది రైతులు లబ్ధి చేకూరనుంది.
అనాథ పిల్లల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ...
అనాథ పిల్లలు,అనాథ శరణాలయాల స్థితి గతులపై అవగాహన విధాన రూపకల్పన కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కమిటీలో సభ్యులుగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, అటవీశాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులను నియమించారు.
మెడికల్ కాలేజీలు వచ్చే ఏడాది ప్రారంభమయ్యేలా..
అలాగే కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల పూర్తి వివరాలను కలెక్టర్ల నుంచి తెప్పించాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేసిన 7 మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. ఏడాది లోగా మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగేలా అనుసరించాల్సిన చర్యలపై చర్చించింది.
మౌలిక వసతులు,కాలేజీలు,హాస్టళ్ల నిర్మాణంపై సమాలోచన జరిపింది. అలాగే భవిష్యత్తులో అనుమతించబోయే మెడికల్ కాలేజీల కోసం స్థలాన్వేషణ,తదితర సౌకర్యాల రూపకల్పనకు ముందస్తు చర్యలు ప్రారంభించాలని వైద్యారోగ్యశాఖను కేబినెట్ ఆదేశించింది.
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు శంకుస్థాపన...
అవసరమున్న జిల్లాల్లో వచ్చే ఏడాదికి మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం చర్యలు ప్రారంభించాలని... అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయాలని కేబినెట్ వైద్యారోగ్య శాఖను ఆదేశించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఐదు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులపై చర్చించింది.
వరంగల్,ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి,గచ్చిబౌలి టిమ్స్,ఎల్బీనగర్లోని గడ్డి అన్నారం,అల్వాల్ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సత్వర నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. త్వరలోనే వీటి నిర్మాణాలకు శంఖుస్థాపన చేయాలని కేబినెట్ ఆదేశించింది. కొత్తగా పటాన్ చెరు పారిశ్రామిక వాడ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేసింది.
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు టిమ్స్గా నామకరణం...
రాష్ట్రంలోని అన్ని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఇకనుంచి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(TIMS)గా నామకరణం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఒక్కచోటనే అందించే సమీకృత వైద్య కాలేజీలుగా వాటిని తీర్చిదిద్ది సత్వరమే వైద్య సేవలు ప్రారంభించాలని ఆదేశించింది.