ఉద్యోగులకు దసరా కానుక..! కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం: వయో పరిమితి పెంపు..!
తెలంగాణ ఉద్యోగలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీఆర్సీతో పాటు వయోపరిమితి పెంపు అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దసరాకు ఉద్యోగులకు కానుకగా రాష్ట్ర ప్రభుత్వం వరాలు ప్రకటిస్తుందని తెలుస్తోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఉద్యోగులకు పీఆర్సీ అమలు ఆలస్యం కానుండటంతో ఐఆర్ ప్రకటిస్తారని అందరూ ఆశించారు. కానీ, సాద్యపడలేదు. ఇక, ఏపీలో ఉద్యోగులకు కొత్త ప్రభుత్వం 27 శాతం ఐఆర్ అమలు చేస్తోంది. అదే విధంగా ఆర్టీసి సమ్మె పైన చర్చించే అవకాశం ఉంది. పండుగల సమయంలో ఈ నెల 5వ తేదీ నుండి ఆర్టీసిలో కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నాయి. దీంతో పాటుగా సచివాలయా నిర్మాణ తుది నమూనాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.
ప్రజారోగ్యంపై తెలంగాణ సర్కార్ నజర్.. పేదలకు 58 రకాల ఆరోగ్య పరీక్షలు ఫ్రీ
ఉద్యోగులకు పీఆర్సీనా..ఐఆర్ అమలా..
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 11వ వేతన సంఘ సిఫార్సుల పైన కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో వేతన సంఘ సిఫార్సుల పైన చర్చించి ఒక కీలక నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం. 2014లో 10 వేతన సంఘం సిఫార్సుల అమల్లో భాగంగా 42 శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు. అయితే, ఇప్పటికే ఏపీలో 27 శాతం ఐఆర్ ను ఉద్యోగులకు అమలు చేస్తున్నారు. దీంతో..తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. ఇందులో భాగంగా వేతన సంఘం సిఫార్సుల పైన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే.. ఆర్థికమాంద్యం తీవ్రంగా ఉండడంతో ఫిట్మెంట్ నిరాశాజనకంగానే ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ భేటీలో పీఆర్సీ అమలు లేదా ఐఆర్ ప్రకటన పైన దసరా సందర్భంగా నిర్ణయం ఖచ్చింగా ఉంటుందని ఉద్యోగ సంఘాలు ఆశతో ఎదురు చూస్తున్నాయి.
వయో పరిమితి పెంపు.. ఆర్టీసీ సమ్మె పైనా
ఇక ఇదే మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ అయిన పదవీ విరమణ వయోపరిమితి పెంపు అంశం పైన కేబినెట్ అజెండాలో చేర్చినట్లు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ఆర్టీసీ సిబ్బందికి సైతం పదవీ విరమణ వయసు 58 నుండి 60 ఏళ్లకు పెంచింది. దీంతో..ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులు డిమాండ్ పైన ఒత్తిడి పెంచుతున్నారు. ఈ కేబినెట్ సమావేంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 లేదా 60 ఏళ్లకు పెంచే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గరిష్ఠంగా ఉద్యోగుల వయోపరిమితిని 2 ఏళ్లకు పెంచే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగానే పరిశీలిస్తోంది.
మరోవైపు ఆర్టీసీ సమ్మెపైనా చర్చించనున్నట్లు సమాచారం. 5 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు ఆర్టీసీ యూనియన్లు ప్రకటించడంతో దసరా పండగకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. దీంతో సమ్మె అంశం చర్చకు వస్తుందని ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయి.
సచివాలయ నిర్మాణ నమూనాలకు ఆమోదం..!
కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించిన నమూనాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే 9 సంస్థలు ప్రభుత్వానికి డిజైన్లను సమర్పించినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ వీటిలో కొన్నింటిని ఎంచుకొని పరిశీలించనున్నట్లు తెలిసింది. కొత్త సచివాలయ నిర్మాణం కోసం ప్రభుత్వం 14 సంస్థల నుంచి డిజైన్లను కోరింది.
వాటిలో 9 సంస్థలు ఇచ్చిన ఆకృతుల్లో కొన్నింటిని షార్ట్లిస్ట్ చేసి, ఒక డిజైన్ను ఎంపిక చేసే అవకాశం ఉంది. సీఎం కేసీఆరే డిజైన్ను ఖరారు చేయాల్సి ఉంది. కేబినెట్ భేటీలో దీనిపై చర్చించే అవకాశం ఉండడంతో అధికారులు డిజైన్ల సమాచారాన్ని సిద్ధం చేశారు. ఇక, రాజకీయంగా హుజూర్నగర్లో పాగా వేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా ఈ భేటీలో సీఎం కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.