భేటీకి బావ బామ్మర్దులు సిద్ధం.. కీలక అంశాలపై దృష్టిపెట్టనున్న హరీష్, కేటీఆర్
హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి ముహుర్తం ఖరారైంది. మంగళవారం నాడు సాయంత్రం 4 గంటలకు కేబినెట్ మంత్రులు సమావేశం కానున్నారు. ప్రగతి భవన్ వేదికగా జరగనున్న మంత్రివర్గ సమావేశం ఆసక్తికరంగా మారింది. మలి విడత మంత్రివర్గ విస్తరణలో మినిస్టర్స్గా ఛాన్స్ కొట్టేసిన బావాబామ్మర్దులు హాజరుకానున్న తరుణంలో ఈ మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కీలక అంశాలు చర్చించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో ఏయే అంశాలు కేబినెట్ మీటింగ్లో ప్రస్తావనకు వస్తాయనే విషయం చర్చానీయాంశంగా మారింది.
తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ముహుర్తం ఫిక్స్
తెలంగాణ మంత్రివర్గ సమావేశం పూర్తిస్థాయిలో జరగనున్న నేపథ్యంలో ఆసక్తికరంగా మారింది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్ సహా 12 మంది మంత్రివర్గంలో కొలువుదీరారు. అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో మరో ఆరుగురికి చోటు కల్పిస్తూ ఫుల్ ప్లెడ్జ్ కేబినెట్ సిద్ధం చేశారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఒక్కరోజు ముందే ఆరుగురు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి కేబినెట్ సమావేశం జరగడం ఇదే మొదటిసారి. అందుకే ఏయే అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.
సొంత ఊరికి మేలు చేయండి.. ఎంతో కొంత సాయం చేయండి.. కలెక్టర్ పిలుపుతో భారీగా విరాళాలు
కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ఆ మేరకు మంగళవారం నాడు ముహుర్తం ఫిక్స్ చేశారు. ప్రగతి భవన్లో సాయంత్రం నాలుగు గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. అయితే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త రెవెన్యూ చట్టంతో పాటు కొత్త సచివాలయ నిర్మాణంపై ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం అమలుకు సంబంధించి ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగంతో చాలాసార్లు సమావేశమై సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు.
బావాబామ్మర్ధులు ఏం చేయబోతున్నారు..!
తొలి విడత మంత్రివర్గంలో కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావుకు, కేసీఆర్ తనయుడు కేటీఆర్కు మంత్రి పదవులు దక్కకపోవడం చాలా రకాల వాదనలకు దారి తీసింది. అల్లుడు హరీశ్ రావును కేసీఆర్ కావాలనే దూరం పెట్టారనే ప్రచారం చక్కర్లు కొట్టింది. అదే క్రమంలో కేటీఆర్ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడంతో భవిష్యత్తు సీఎంగా రకరకాల కామెంట్లు వినిపించాయి. అయితే జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ స్ట్రాటజీ వర్కవుట్ కాకపోవడంతో కేబినెట్లో ఆ ఇద్దరికి మంత్రి పదవులు మళ్లీ దక్కాయనే టాక్ నడిచింది. మొత్తానికి మంత్రివర్గ మలి విడత విస్తరణలో బావాబామ్మర్దులైన హరీశ్ రావు, కేటీఆర్కు మంత్రి పదవులు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రివర్గం మంగళవారం నాడు సమావేశం కానుండటంతో ఈ ఇద్దరు ఏం చేయబోతున్నారనేది చర్చానీయాంశమైంది.
అధికారం కోసం సెక్స్ రాకెట్.. మధ్యప్రదేశ్ స్కాండల్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఇవేనా కీలకాంశాలు..!
హుజుర్నగర్ ఉప ఎన్నిక, యురేనియం తవ్వకాలపై వ్యతిరేకత, విష జ్వరాల విజృంభణ.. తదితర అంశాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్గా పరిణమించాయి. విపక్ష నేతలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా వ్యవహరిస్తుండటంతో ఏం చేయాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు టీఆర్ఎస్ పెద్దలు. అదే క్రమంలో కేబినెట్ భేటీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టం, సచివాలయం శంకుస్థాపన తదితర అంశాలు ప్రస్తావనకు వస్తాయని సమాచారం అందుతున్నప్పటికీ.. పైన పేర్కొన్న అంశాలపై కూడా మంత్రివర్గం సమావేశంలో కూలంకశంగా చర్చిస్తారేమోనన్నది మరో కోణంగా కనిపిస్తోంది.