ఈ నెల 28న తెలంగాణా క్యాబినెట్ భేటీ ... ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 28వ తేదీన జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం తర్వాతి రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి, తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరుతున్న క్రమంలో ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్.
గవర్నర్ సూచనలను కేసీఆర్ పాటిస్తారా: ముఖ్యమంత్రి తేల్చిందేంటి: ఆర్టీసీలో ఇక జరిగేది అదేనా..!
తెలంగాణా రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అనేక అంశాలతో పాటు,ఆర్టీసీ అంశం కూడా క్యాబినెట్లో చర్చించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్టీసీ సమస్యను ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజులపాటు కొనసాగే కేబినెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారు. అయితే తెలంగాణా ఆర్టీసీని కాలగర్భంలో కలిసిపోయే లాగా, ఆర్టీసీ మూసివేత దిశగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారేమో అన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది.
తమ ఏ ఒక్క డిమాండ్లు పరిష్కారం కాకున్నాఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించి విధుల్లో చేరతామని ప్రకటించినా ససేమిరా అంటోంది ప్రభుత్వం . ఇక ఈ సమయంలో సీఎం కేసీఆర్ కార్మికుల పై సానుభూతితో నిర్ణయం తీసుకుంటారు అన్న ఆలోచన ఏ ఒక్కరికీ కలగటం లేదు. ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఆర్టీసీని నిర్వీర్యం చేసే యత్నమే అన్న కోణంలో చర్చ సాగుతుంది. ఇక ఇలాంటి సమయంలో తెలంగాణా క్యాబినెట్ నిర్వహించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులను తీవ్ర ఆందోళనలోకి నెడుతుంది.