నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ ... కీలక అంశాలు ఇవే !!
నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్న కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కరోనా నియంత్రణ, కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ నేపథ్యంలో వైద్య రంగంలో తీసుకురావాల్సిన పలు మార్పులు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. విద్యా రంగంలో తీసుకురావాల్సిన మార్పులు, కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈరోజు క్యాబినెట్ చర్చించనుంది.
కరోనా: ప్రైవేటు దోపిడీపై కేసీఆర్ కొరడా - సోమాజిగూడ దక్కన్ ఆసుపత్రిపై వేటు
కొత్త సచివాలయం నిర్మాణంపై కీలక చర్చ
అంతేకాదు నేటి భేటీ లో కొత్త సచివాలయం నిర్మాణంపై కీలక చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కొత్త సచివాలయం నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని శరవేగంగా పనులు జరిగేలా సమీక్షలు నిర్వహిస్తున్నారు. సచివాలయం ఏ విధంగా ఉండాలి.. సీఎం ఛాంబర్, పేషీలు, మంత్రుల ఛాంబర్లు , మంత్రుల పేషీలు ఏ విధంగా ఉండాలి అన్న అంశాలపై సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహించిన సీఎం కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణంలో ప్రతి అంగుళం పై కూలంకషంగా చర్చిస్తున్నారు.
సచివాలయ కొత్త డిజైన్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం
సమావేశ మందిరాలు, పార్కింగ్ స్థలాలు, ల్యాండ్ స్కేప్ గార్డెన్స్, వివిధ అంతస్థుల ఎత్తు, పొడవు వెడల్పులు, వరండాలు, వసారాలు ఇలా ఒకటేమిటి ప్రతి అంశాన్ని చర్చిస్తున్న కెసిఆర్ కొత్త సచివాలయం నిర్మాణం పై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. నేడు జరగనున్న భేటీలో కొత్త సచివాలయ నిర్మాణంపై మంత్రులకు వివరించనున్నారు కెసిఆర్. అంతేకాదు సచివాలయ కొత్త డిజైన్లకు కూడా ఆమోదం తెలపనున్నారని సమాచారం.
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుపై చర్చ
గతంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుండి 60 ఏళ్లకు పెంచుతామని మాట ఇచ్చిన కేసీఆర్ నేడు జరిగే కేబినెట్ సమావేశంలో దీన్ని టేబుల్ ఎజెండాగా చర్చించనున్నారని సమాచారం. నేడు భేటీలో వయో పరిమితి పెంపుఫై మంత్రి వర్గం ఆమోదించాక పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ నేడు సాధ్యం కాకపోతే ఆగస్టు 15వ తేదీన దీనిపై కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నట్లు గా తెలుస్తుంది.
కరోనా కట్టడి, వైద్య రంగంలో మార్పులపై నిర్ణయాలు
ఉద్యోగుల జీతాల్లో కోత, ఆయుష్ వైద్యుల వయో పరిమితి పెంపు కోసం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ లకు నేడు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది అని చెబుతున్నారు. మొత్తానికి కొత్త సచివాలయం నిర్మాణం, రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఇక ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు వంటి అనేక కీలక అంశాలపై నేడు తెలంగాణ కేబినెట్ చర్చించనుందని సమాచారం. ఇక నేటి భేటీ నేపధ్యంలో క్యాబినెట్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది.