తెలంగాణలో ఆ మంత్రికి ఉద్వాసన..? పనితీరు ఆధారంగా చెక్ పెట్టనున్న సీఎం కేసీఆర్..!!
హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసి కార్మికులు తలపెట్టిన సమ్మె ఓ కొలిక్కి రావడంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పంతం నెగ్గించుకున్నట్టైంది. దీంతో పాటు మంత్రి వర్గం పైన దృష్టి కేంద్రీకరించిన సీఎం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. పనితీరు, ప్రజామోదం ఆధారంగా కొందరిపై వేటు వేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా మంత్రుల పెర్ఫార్మెన్స్ ను సీఎం లోతుగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా లోక్ సభ ఎన్నికల్లో సరిగ్గా పనిచేయని మంత్రులను కూడా సీఎం టార్గెట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ముందుగా పనితీరు అస్సలు బాగా లేని మేడ్చల్ నియోజక వర్గానికి ప్రతినిధ్యం వహిస్తున్న ఆ మంత్రికి ఉద్వాసన పలకాలని సీఎం చంద్రశేఖర్ రావు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళన..!
తెలంగాణ మంత్రి వర్గంలో తొలిసారి అవకాశం చేజిక్కించుకున్న మేడ్చెల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై సీఎం చంద్రశేఖర్ రావు దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. త్వరలోనే మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకనున్నారని గులాబీ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. చంద్రశేఖర్ రావు రెండోసారి అధి కారంలోకి వచ్చాక ఎవరూ ఊహించని విధంగా మల్లారెడ్డిని తన కేబినెట్లోకి తీసుకున్న చంద్రశేఖర్ రావు, ఆయనకు కార్మిక, ఉపాధి కల్పన, మహిళా, శిశుసంక్షేమ శాఖను అప్పగించారు. అయితే శాఖాపరంగా ఆయన పనితీరు సంతృప్తికరంగా లేకపోవడంతో మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని చంద్రశేఖర్ రావు భావిస్తున్నట్లు సమాచారం.
టీడిపి నుండి టీఆర్ఎస్ లోకి మారిన మల్లారెడ్డి..!
విద్యాసంస్థల అధినేతగా, వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన చామకూర మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. అయితే రెండేళ్లకే టీడీపీకి రాజీనామా చేసి, 2016 జూన్లో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం 2018 ముందస్తు ఎన్నికల్లో ఎంపీగా ఉన్న మల్లారెడ్డిని మేడ్చెల్ అసెంబ్లీకి పోటీ చేయించారు చంద్రశేఖర్ రావు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన మల్లారెడ్డిని కేబినెట్లోకి తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు చంద్రశేఖర్ రావు. ఈక్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు మల్లారెడ్డి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు.
ఎంపీ సీటును గెలిపించలేక పోయిన మల్లారెడ్డి..!
అయితే రోజులన్ని ఒక్కలాగే ఉండవు. కాలంతో పాటు అభిప్రాయాలు కూడా మారుతుంటాయి. అందులో భాగంగానే ఇటీవలి కాలంలో సీఎం చంద్రశేఖర్ రావు, మల్లారెడ్డికి ప్రధాన్యత తగ్గిస్తూ వస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ యేడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా చంద్రశేఖర్ రావు, మల్లారెడ్డి అల్లుడికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కేటాయించారు. రేవంత్రెడ్డిని ఓడించేందుకు చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సీటు ఇచ్చినా అక్కడ టీఆర్ఎస్ ఓడిపోవడం కూడా చంద్రశేఖర్ రావు అసంతృప్తికి మరో కారణంగా చర్చ జరుగుతోంది.
Recommended Video
ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవులు..!
మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని, మల్లారెడ్డికి మంత్రి పదవి అప్పగించినప్పటి నుంచే సీనియర్లు ఆయన పై అసంతృప్తితో ఉన్నారు. అంతేగాక ఇటీవల మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి సబితా ఇంద్రారెడ్డిని కేబినెట్లోకి తీసుకున్నారు. ఈనేపథ్యంలోనే ఒకే జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉండటం, అది కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా పార్టీకి శ్రేయస్కరం కాదని, సీనియర్ నేతల్లో కూడా అసంతృప్తికి ఆజ్యం పోస్తుందని సీఎం చంద్రశేఖర్ రావు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక మల్లారెడ్డికి చెక్ పెట్టాలని ఆయన నిర్ఱయం తీసుకున్నట్టు అధికార పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి మల్లారెడ్డికి ఉద్వాసనకు సీఎం ముహూర్తం ఎప్పుడు ఖరారు చేస్తారో చూడాలి.