ఉగ్రవాదుల ఏరివేత: తెలంగాణ ఐపీఎస్ అధికారిణి: కాశ్మీర్లో పోస్టింగ్: తొలి మహిళగా రికార్డు
హైదరాబాద్: తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారిణి అరుదైన ఘనతను సాధించారు. అత్యంత కీలకమైన ప్రమాదకరంతో కూడుకున్నబాధక్యతలను అందుకున్నారు. ఈ బాధ్యతలను అందుకున్న తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి అమే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటిదాకా ఏ మహిళా ఐపీఎస్ అధికారి కూడా ఆ పోస్టులో నియామకం కాలేదు. అలాంటిది.. ఆ అధికారిణి ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకుని కేంద్రం హోమ్ మంత్రిత్వ శాఖ ఆమెకు ఈ బాధ్యతలను అప్పగించింది.
Recommended Video
శ్రీనగర్ ఐజీగా చారు సిన్హా
ఆమే- చారు సిన్హా. 1996 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారిణి. రెండు తెలుగు రాష్ట్రాలకు చిరపరిచితమైన పేరు. రాష్ట్ర విభజన తరువాత ఆమె తెలంగాణ కేడర్కు వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్నారు. ఆమెకు కొత్తగా జమ్మూ కాశ్మీర్లో పోస్టింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలను జారీ చేసింది. కేంద్రీయ రిజర్వు పోలీస్ బలగాల (సీఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ జనరల్గా నియమించింది. శ్రీనగర్ సెక్టార్ ఐజీగా బదిలీ చేసింది.
ఉగ్రవాదుల హిట్లిస్ట్లో
సీఆర్పీఎఫ్ శ్రీనగర్ సెక్టార్ ఐజీగా ఓ మహిళా ఐపీఎస్ అధికారిణి నియమితులు కావడం ఇదే తొలిసారి. అందుకే ఆమె పేరు మారుమోగిపోతోంది. ఉగ్రవాదుల హిట్లిస్ట్లో ఉండే సెక్టార్ అది. ఉగ్రవాదుల ఏరివేత కార్యకలాపాలను చారుసిన్హా స్వయంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆర్మీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, జవాన్లతో కలిసి ఉగ్రవాదుల కోసం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, ఎన్కౌంటర్లకు దిశా నిర్దేశాన్ని సూచించాల్సి ఉంటుంది.
బిహార్లో మావోయిస్టు ఏరియాలో
ఇదివరకు చారు సిన్హా సీఆర్పీఎఫ్ బిహార్ సెక్టార్ ఐజీగా పనిచేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో టాప్లో ఉండే సెక్టార్ ఇది. ఈ సెక్టార్లో చారు సిన్హా పనితీరును పరిశీలించిన తరువాతే.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమెను శ్రీనగర్కు బదిలీ చేసిందని అంటున్నారు. బిహార్లో మావోయిస్టులను నియంత్రించడానికి, వారు జనజీవనంలో కలిసిపోవడానికి అనుసరించిన వ్యూహాలు అద్భుత ఫలితాలను ఇచ్చాయని చెబుతున్నారు. అందుకే ఈ సారి అత్యంత కీలకమైన అంతే కఠినమైన శ్రీనగర్ సెక్టార్ సీఆర్పీఎఫ్ ఐజీ బాధ్యతలను చారు సిన్హాకు అప్పగించారు.
జమ్మూ నుంచి
అనంతరం ఆమెను జమ్మూ సెక్టార్కు బదిలీ చేశారు. అక్కడి నుంచి తాజాగా శ్రీనగర్ సెక్టార్ బాధ్యతలను అప్పగించారు.
సీఆర్పీఎఫ్ శ్రీనగర్ సెక్టార్ పరిధిలో రెండు రేంజ్లు, 22 ఎగ్జిక్యూటివ్ యూనిట్లు, మూడు మహిళా పోలీసు కంపెనీలు, పారామిలటరీ బలగాలు ఉన్నాయి. వాటన్నింటికీ చారు సిన్హా హెడ్గా వ్యవహరిస్తారు. చారు సిన్హాతో పాటు సీఆర్పీఎఫ్లో సీనియర్ ర్యాంక్లో పనిచేస్తోన్న ఆరు మంది ఐపీఎస్ అధికారులను కేంద్రం బదిలీ చేసింది. జార్ఖండ్ సెక్టార్ ఐజీ మహేశ్వర్ దయాళ్, జమ్మూ సెక్టార్ పీఎస్ రణ్పీసే, రాజు భార్గవక కొత్తగా పోస్టింగులు ఇచ్చింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో
రెండు తెలుగు రాష్ట్రాల్లో చారుసిన్హా కీలక పదవుల్లో పనిచేశారు. పులివెందుల, ఏలూరు ఎఎస్పీగా పనిచేశారు. మెదక్ జిల్లా ఓఎస్డీ (యాంటీ నక్సల్స్ ఆపరేషన్) గా, నిజామాబాద్, చిత్తూరు, ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేశారు. చాలాకాలం కిందటే ఆమె సెంట్రల్ సర్వీసులకు వెళ్లారు. సీఆర్పీఎఫ్లో కొనసాగుతున్నారు. హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఆప్ విమెన్లో చదువుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పీజీ పూర్తి చేశారు.