చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా, నేను మంత్రగాడినేమోనని ఆశ్చర్యపోతున్నారు: కేసీఆర్
ఖమ్మం/పాలకుర్తి: పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి దయాకరరావును అద్భుత మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ అన్నారు. గోదావరి జలాలతో చెరువులను నింపించిన ఘనత ఎర్రబెల్లి అన్నారు. ప్రపంచం ఆశ్చర్యపడేలా రైతు బంధు పథకం అమలు చేస్తున్నామని చెప్పారు.
శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ విషయంపై స్పందించిన ఉత్తమ్, ఇచ్చిన ఆఫర్ తెలుసా?
కేసీఆర్ తొలుత ఖమ్మం బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తిలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. రెండు బహిరంగ సభల్లో తాము అమలు చేస్తున్న, అమలు చేయబోయే పథకాలను చెప్పారు.
ఎన్నికలు అన్నప్పుడు కుల కంపు ఉంటుంది
తాను యాగం పూర్తి చేసి, నేరుగా ఇక్కడకు వచ్చానని కేసీఆర్ ఖమ్మం బహిరంగ సభలో చెప్పారు. రాష్ట్రం బాగుండాలని రాజ్యశ్యామల యాగం చేశానని చెప్పారు. ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా అని, ఈసారి ఖమ్మంలో పదికి పది స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు అన్నప్పుడు కుల కంపు, డబ్బు పంచడాలు, గజకర్ణ గోకర్ణ టక్కు టమారాలు ఉంటాయని చెప్పారు. కానీ ఖమ్మం ప్రజలు చాలా వివేకవంతులు అన్నారు. మనం ఎవరూ శాశ్వతం కాదని, కానీ మన రాష్ట్రం శాశ్వతం, రాష్ట్ర మనుషులు శాశ్వతమని, కాబట్టి వివేకంతో మనం ఓటేయాలన్నారు.
అలాంటి ఇళ్లు ఇవ్వడం లేదు, అందుకే ఆలస్యం
ఉద్యమం సమయంలో తాను ఏం జరుగుతాయని చెప్పానో వంద శాతం అవి జరుగుతున్నాయని కేసీఆర్ ఖమ్మంలో అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలోనే అలా అమలు చేస్తున్న ఒకే ఒక పార్టీ తెరాస అన్నారు. డబుల్ బెడ్రూం కట్టారా, దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చారా అని అడుగుతున్నారని, కానీ తాము ఇప్పుడు 2 లక్షలకు పైగా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. తాము డబ్బాలా ఇల్లు కట్టించడం లేదన్నారు. డబుల్ బెడ్రూం ఇల్లు కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ అన్ని సౌకర్యాలు ఉంటాయని, రెండు తరాలకు పనికి వస్తాయన్నారు.
ఉద్యమం సమయంలో ఖమ్మం చాలాసార్లు వచ్చా
58 ఏళ్ల పాటు పాలించిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏం చేశాయని కేసీఆర్ నిలదీశారు. కంటివెలుగు పథకానికి ఎర్రవెల్లి స్ఫూర్తి అని చెప్పారు. ఇన్నేళ్లు పాలించిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఆలోచనలు ఎందుకు రాలేదన్నారు. దాదాపు 411 పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఉద్యమం సమయంలో ఖమ్మం జిల్లాకు పలుమార్లు వచ్చానని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఎంతో చెబుతారని, వీరి మేధావితనం వల్ల కరెంట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నేను కూడా రైతునేనని, ఈ టీడీపీ, కాంగ్రెస్ మేధావులు, ఘనాపాటీలు ఎందుకు ఉచిత కరెంట్ ఇవ్వలేదన్నారు. నాడు తన మోటార్లు కూడా కాలిపోయాయన్నారు.
చేతులు పైకెత్తి దండం పెట్టి చెబుతున్నా
నేను రెండు చేతులు పైకెత్తి దండం పెట్టి చెబుతున్నానని, ఇక్కడి నుంచి మీరు వెళ్లిపోయిన తర్వాత, మీ గ్రామాల్లో చర్చలు పెట్టి, మీరు ఓటు వేయాలని చెప్పారు. మాది తప్పు అనిపిస్తే మాకు ఓటు వేయవద్దన్నారు. అందుకే చర్చలు జరిపిన తర్వాత ఓటు వేయాలన్నారు. ఓ కులం, మతం అన్నం పెట్టదన్నారు. మన కులం వాడు అని ఓటు వేసి, గెలిపిస్తే, మనం కులం వాడు సీఎం అవుతాడనుకుంటే వచ్చేది ఏమీ లేదన్నారు.
కేసీఆర్ ఏమైనా మాయగాడా, మంత్రగాడా అని ఆశ్చర్యపోతున్నారు
నేడు పవిత్ర ఏకాదశి, కార్తీక సోమవారం, పవిత్రమైన రోజు అని కేసీఆర్ చెప్పారు. నేను యాగం చేసి వచ్చానని చెప్పారు. తుమ్మల నాగేశ్వర రావు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. ఆయన తనకు సన్నిహితుడు కాబట్టి గొప్పవాడు అని చెబుతానని, కానీ ఆయన ఏమిటో మీకు కూడా తెలుసునని చెప్పారు. తెలంగాణ అన్నింటా ముందంజలో ఉందని చెప్పారు. దీంతో కేసీఆర్ ఏమైనా మాయగాడా, మంత్రగాడా అని దేశం యావత్తు ఆశ్చర్యపోతోందన్నారు. గుజరాత్ వంటి రాష్ట్రాల కంటే మనం ముందున్నామని, రెండంకెల అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ, చత్తీస్గఢ్ మాత్రమే ఉందన్నారు.