ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఓటర్ల జాబితా అభ్యంతరాల స్వీకరణ: రజత్ కుమార్
హైదరాబాద్: అసెంబ్లీ రద్దు అయిన తర్వాత నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్కుమార్ తెలిపారు. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎక్కడా పేర్కొనలేదని చెప్పారు. సెప్టెంబర్ 15, 16వ తేదీల్లో గ్రామస్థాయిలో పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ల జాబితాపై ఉన్న అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరిస్తామని చెప్పారు.
హైదరాబాద్లో శుక్రవారం రజత్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందాలని పేర్కొన్నారు. ఓటర్లను చైతన్యపరిచేందుకు తమ యంత్రాంగం చర్యలు చేపట్టిందని రజత్కుమార్ వివరించారు.
ప్రతి గ్రామంలోనూ ప్రజలను చైతన్యపరిచేలా ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.
ఎన్నికలు: కేసీఆర్పై గద్దర, కేటీఆర్పై విమలక్క పోటీ
రాజకీయ పార్టీల సమక్షంలోనే ఈవీఎంల పనితీరును పరిశీలిస్తున్నామని రజత్ కుమార్ చెప్పారు. మన దేశంలో ఈవీఎంల పనితీరు చాలా పక్కాగా ఉందని.. న్యాయస్థానాల్లో 37 కేసులు వేసినా ఈవీఎంలపై అనుకూలంగానే నిర్ణయం వచ్చిందని తెలిపారు. ఈవీఎం మిషన్లు రాగానే వాటిని రాజకీయ పార్టీల సమక్షంలో పరీక్షిస్తామని, ఈసారి కొత్తగా వీవీప్యాట్ మిషన్లు ఏర్పాటు చేస్తామని రజత్ కుమార్ చెప్పారు.
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు పంపిణీ చేసే నగదుపై నిఘా పెడుతామని రజత్ కుమార్ స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చును క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారంపై వచ్చే కథనాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.