ఉప ఎన్నికల్లానే! కొత్త టెక్నాలజీ: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ఈసీ స్పందన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల అంశంపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్పందించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలొస్తే తాము ఎలా వ్యవహరించాలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు.
ఉప ఎన్నికల్లానే ముందస్తు
ముందస్తు ఎన్నికలు వచ్చినా.. ఉప ఎన్నికలు ఎలా ఉంటాయో.. అదేవిధంగా ముందస్తు ఎన్నికలు ఉంటాయని రజత్ కుమార్ తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణకై ప్రవేశపెట్టిన ఆధునిక సాఫ్ట్వేర్ ఈఆర్ఓ నెట్ 2.0 వర్షన్పై అన్ని జిల్లాల ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు జీహెచ్ఎంసీలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో రజత్ కుమార్ తోపాటు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ పాల్గొన్నారు.
ఢిల్లీ నుంచి నిపుణులు..
అనంతరం రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ కోసం రూపొందించిన కొత్త ఈఆర్ఓ నెట్పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు రాష్ట్ర అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎలక్టోరల్ రోల్ మేనేజ్మెంట్ సిస్టం ఉండేదని, దాని స్థాని స్థానంలో ఈఆర్ఓ నెట్ అనే కొత్త విధానం భారత ఎన్నికల కమిషన్ అమల్లోకి తెచ్చినట్లు వివరించారు.
దేశ వ్యాప్తంగా కొత్త విధానమే..
రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఈఆర్ఓ నెట్ అమల్లోకి వస్తుందని రజత్ కుమార్ తెలిపారు. ఈ విధానంతో నకిలీ ఓటర్లను ఏరివేయవచ్చని ఆయన తెలిపారు. ఈ ప్రోగ్రామ్లో ఎంటర్ చేస్తే.. ఫొటోపాటు వారి వివరాలు స్పష్టంగా ఉంటాయని, షెడ్యూల్ ప్రకారం జనవరి ఒకటి నాటికి ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి, అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అయితే ఓటర్ల జాబితాకు ఆధార్ అనుసంధానం న్యాయవ్యవస్థ పరిధిలో ఉందని, ఇప్పుడు దానిని పరిగణలోకి తీసుకోవడం లేదని రజత్ కుమార్ స్పష్టం చేశారు.
కేసీఆర్ ముందస్తు వెళతారా?
కాగా, సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్దామనే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు ఆయన ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఎన్నికల ప్రచారాన్ని కొంగరకలాన్ సభతోనే ప్రారంభించినట్లు తెలుస్తోంది. తాజాగా, 50రోజుల్లో 100 సభలను నిర్వహిస్తామని టీఆర్ఎస్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.