పెథాయ్ తుఫాను ఎఫెక్ట్: ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి పర్యటనకు ఆటంకం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాల్సి ఉంది. అయితే పెథాయ్ తుఫాను, భారీ వర్షాల కారణంగా ఈ సందర్శన కార్యక్రమం వాయిదా పడింది. తుపాను ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుందనే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత ప్రకటన చేయనున్నారు. కేసీఆర్ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా శనివారం రాష్ట్రంలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన ఖరారైంది. ప్రాజెక్టుల పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదని ఓసారి తానే స్వయంగా వచ్చి పనులను పరిశీలిస్తానని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో రేపు కాళేశ్వరానికి వెళ్లాల్సి ఉండగా తుపాను కారణంగా వాయిదా పడింది. కేసీఆర్ తొలి పర్యటనకు అడ్డంకి ఏర్పడటంతో శకునం బాగా లేదా అనే చర్చ సాగుతోంది.