ఎంసెట్ 2 లీకేజీలో మధ్యవర్తిగా 'తిరుమల్': ఎక్కడి వాడు, ఏం చేశాడు?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్ 2 పేపర్ లీకేజి వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఈ లీకేజీ వ్యవహారంలో కీలక నిందితుడు రాజగోపాల్ రెడ్డి నుంచి సీఐడీ అధికారులు సమాచారాన్ని రాబడుతున్నారు. ఎంసెట్ లీకేజి వ్యవహారంలో భాగంగా రాజగోపాల్ మధ్యవర్తుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించినట్లు దర్యాప్తు ద్వారా వెలుగు చూసింది.
2 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: 320 ప్రశ్నలను విద్యార్ధులకు ఇచ్చారన్న సీఐడీ
పేపర్ లీకేజి నుంచి విద్యార్ధులతో పరీక్ష రాయించడం వరకు పలువురు వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాడు. మొత్తం మూడు దశల్లో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించిన సీఐడీ అధికారులు ఆయా దశల్లో కీలకంగా వ్యవహరించిన వారు, సహకరించి వారి వివరాలను రాబడుతున్నారు.
ఈ లీకేజీ వ్యవహారంలో కన్సల్టెన్సీ నిర్వాహకుడు విష్ణు, దళారీ తిరుమల్ అనే ఇద్దరు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నట్టు సీఐడీ పోలీసులు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఐడీ అధికారుల అదుపులో ఉన్న బండారు తిరుమల్ గత చరిత్రను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఎంసెట్ 2: లీకు లీడర్ రాజగోపాల్కు ప్రింటింగ్ వివరాలు చెప్పిందెవరు?
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లికి చెందిన తిరుమల్ జిల్లా కేంద్రంలో చిట్ ఫండ్ వ్యాపారం ప్రారంభించాడు. చిట్టీలు వేసిన వారికి చిట్టీ డబ్బులను చెల్లించకుండా అక్కడి నుంచి ఉడాయించి రెండు నెలల క్రితం హైదరాబాద్కు మకాం మార్చాడు. కాగా, ఐదేళ్ల క్రితం నిర్వహించిన ఎంసెట్లో తిరుమల్ కుమారుడికి మెడికల్ విభాగంలో సీటు వచ్చింది.
అప్పటి నుంచే కొంతమంది ఎంసెట్ నిర్వాహకులతో సత్సంబంధాలు ఏర్పచుకున్న తిరుమల్ అక్రమ సంపాదనకు అలవాటు పడి ఈ ఎంసెట్ 2 లీకేజిలో కూడా ముఖ్యపాత్రను పోషించినట్టు పలువురు చెబుతున్నారు. తిరుమల్కు నల్గొండ జిల్లాలో ఉన్న విస్తృత పరిచయాలను దృష్టిలో పెట్టుకుని భారీస్థాయిలో బేరసారాలు జరిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల ఓ కుల సంఘం పెద్దను కలిసి ''ఎంబీబీఎస్, ఎండీ సీట్లలో మీ కులంవారిని చేర్పించండి. ఒక్కో సీటుకు రూ.75 లక్షలు చెల్లించినట్లయితే అందులో రూ. 10 లక్షలు మీకు కమీషన్గా ఇస్తా'' అని ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. మణిపూర్, నేపాల్లో ఎండీ సీట్లను ఇప్పిస్తానని పలువురు ఎంబీబీఎస్ విద్యార్థులను నమ్మబలికాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇక ఎంసెట్ 2 విషయానికి వస్తే ముంబై, బెంగుళూరు కేంద్రాలుగా ఎంసెట్ 2 పేపర్లు లీకైనట్లు సీఐడీ గురువారం అధికారికి ప్రకటన విడుదల చేసింది. పరీక్షకు రెండు రోజుల ముందు ఐదు సిటీల్లో విద్యార్ధులకు శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం విష్ణు, తిరుమల్ కలిసి 25 మంది విద్యార్ధులను బెంగుళూరుకు తీసుకెళ్లి ప్రిపేర్ చేయించారు.
ఆ తర్వాత ఒక్కొక్కరి నుంచి రూ. 30 లక్షల నుంచి రూ.40 లక్షలు వసూలు చేశారని స్పష్టం చేసింది. తెలంగాణ, ఏపీకి చెందిన 25 మంది విద్యార్థుల్ని హైదరాబాద్, ముంబై, బెంగళూరు, గోవాల్లోని రహస్య ప్రాంతాలకు మూడు రోజుల ముందుగా తరలించి, అక్కడ క్యాంపు నిర్వహించిన తర్వాత విద్యార్థులను విమానాల్లో నేరుగా పరీక్ష కేంద్రానికి తరలించారు.
ఇదిలా ఉంటే ఎంసెట్ 2 పేపర్ లీకేజికి సంబంధించి సీఐడీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఎంసెట్ 2 పేపర్ రద్దుపై తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అధికారింగా నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ శుక్రవారం వర్సిటీలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, కార్యదర్శులు, వైస్ ఛాన్సలర్లు హాజరుకానున్నారు. ఈ సమావేశం అనంతరం ఎంసెట్ 2 పరీక్షపై సీఎం అధికారిక ప్రకటన చేయనున్నారు.