తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ ఏది..?
హైదరాబాదు: స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ సమాయత్తమవుతోంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి తమ సత్తా చాటుకోవాలని బీజేపీ కాంగ్రెస్లు భావిస్తున్నాయి. స్థానిక సమరంలో మెజార్టీ సీట్లు సాధించి టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు కాంగ్రెస్ బీజేపీలు కృషిచేస్తున్నాయి. ఈ మేరకు రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పార్టీ మాత్రం స్థానిక ఎన్నికల్లో విజయం తమనే వరిస్తుందని వారికి ఈ ఎన్నికలు నల్లేరుపై నడకే అనే విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
బీజేపీ ఏం చెబుతోంది..?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. గెలుపు కోసం ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ఎటు చూసినా ఎన్నికల ముచ్చటే వినిపిస్తోంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 4 సీట్లను గెల్చుకుని ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. కాంగ్రెస్కు మూడు లోక్సభ సీట్లు మాత్రమే దక్కడంతో బలమైన టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు బీజేపీని చూస్తున్నారని కమలనాథులు చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్పై టీఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కాంగ్రెస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు.
టీఆర్ఎస్, బీజేపీలు దొందూ దొందే: ఉత్తమ్
టీఆర్ఎస్ బీజేపీలు రెండు పార్టీలు దొందూ దొందే అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించారని కాంగ్రెస్ ఎంపీ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో విఫలైమందని ఆరోపించారు. దీనివల్ల సరైన రోడ్లు లేకపోవడం, సరైన పరిశుభ్రత లేకపోవడం వంటి అంశాలు నిత్యం సమస్యగా మారాయని చెప్పారు. ఇక రహదారులైతే అద్వాన పరిస్థితికి చేరుకున్నాయని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళితే ప్రజలు ఛీకొడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
బీజేపీలో చేరేందుకు కాంగ్రెస్ నేతల ఆసక్తి
ఇదిలా ఉంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మరో బాంబు పేల్చారు. బీజేపీ చేస్తున్న కార్యక్రమాలు గ్రామాలకు కూడా వెళుతున్నాయని ప్రజలు తమవైపే ఉన్నారని లక్ష్మణ్ చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నేతలు బీజేపీకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని వెల్లడించారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లను గెలుచుకుని టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని లక్ష్మణ్ చెప్పారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ తెలంగాణలో మహాశక్తిగా ఎదుగుతుందని లక్ష్మణ్ చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నాకు ప్రతిష్టాత్మకం
బీజేపీ కాంగ్రెస్లు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పావులు కదుపుతుండగా... ఈ ఎన్నికలు మున్సిపల్ శాఖ మరియు పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్కు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రిగా తాను చేసిన అభివృద్ధికే ప్రజలు పట్టం కడుతారని, ఈ ఎన్నికలు తనకే ఒక పరీక్ష అని మంత్రి కేటీఆర్ అన్నారు.
కేసీఆర్ లండన్ పలుకులు ఏమయ్యాయి: రేవంత్ ఫైర్
ఇదిలా ఉంటే కేసీఆర్పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కరీంనగర్, వరంగల్ను లండన్లా మారుస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని రేవంత్ రెడ్డి కేటీఆర్ను సూటిగా ప్రశ్నించారు. కేవలం మాటలకే కేసీఆర్ సర్కార్ పరిమితమైందని ధ్వజమెత్తారు. నిజామాబాద్, రామగుండం, కరీంనగర్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు కొన్ని వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని కేటీఆర్ చెబుతున్నారని.. ఒకవేళ నిజంగానే నిధులు విడుదల చేసింటే ఎక్కడికి వెళ్లాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.నిధుల కొరతతో ఈ మున్సిపాలిటీలు ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాయని సూటి ప్రశ్నవేశారు రేవంత్ రెడ్డి.