నిరంతరం పని చెయ్యాల్సిన చోట గ్రామీణాభివృద్ధికి 30 రోజుల కార్యాచరణ ఎందుకు ? ప్రజల్లో , అధికారుల్లో
టీఆర్ ఎస్ అధినేత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వ ఉన్నతాధికారులకు, గ్రామ సర్పంచ్ లకు తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. 30 రోజుల ప్రణాళిక పకడ్బందీగా అమలు చెయ్యాలని చెప్పిన సీఎం వారి పనితీరుకు మార్కులేస్తామని చెప్పారు. బాధ్యతారాహిత్యం సహించనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో , అమలు చేస్తున్న పథకాల విషయంలో అటు ప్రజల్లోనూ, ఇటు అధికారులలోనూ చాలా అసహనం కనిపిస్తుంది .
మరో పథకంతో ఏపీలో కేసీఆర్ బాటలో జగన్ .. పాత పథకం కొత్త బిల్డప్ అన్న లోకేష్
6 నుంచి 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక... బాధ్యతా రాహిత్యానికి భారీ మూల్యం అని హెచ్చరించిన సీఎం కేసీఆర్
పంచాయతీ రాజ్ పై ఈ నెల 6 నుంచి 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని రాజేంద్రనగర్ లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ వేదికగా జరిగిన సమావేశంలో చెప్పిన సీఎం కేసీఆర్ 30 రోజుల ప్రణాళికను కట్టుదిట్టంగా అమలు చేయాలని అటు జిల్లా కలెక్టర్లను, సర్పంచులను ఆదేశించారు. సరిగా పనిచేయని కలెక్టర్లకు వార్షిక ప్రణాళికలో ప్రతికూల మార్కులు వేస్తామని హెచ్చరించారు. అంతేకాదు హరితహారం ద్వారా నాటే మొక్కల్లో 85 శాతం మొక్కలు బతికి తీరాలని లేనిపక్షంలో సర్పంచ్ లపై వేటు వేస్తామని హెచ్చరించారు. పచ్చదనం బాగా ఉండే జిల్లాలలో కలెక్టర్లకు మంచి మార్కులు పడతాయి అని, పచ్చదనం సరిగాలేని జిల్లాలకు ప్రతికూల మార్కులు ఇస్తామని సీఎం కేసీఆర్ తేటతెల్లం చేశారు.
సీఎం కెసిఆర్ 30 రోజుల కార్యాచరణ ప్రణాళికపై ప్రజలలో , అధికారులలో అసహనం .. ఎందుకంటే
సీఎం కెసిఆర్ 30 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అటు ప్రజల్లోనూ, ఇటు అధికార వర్గాల్లోనూ కాసింత అసహనం ఉంది. అందుకు కారణం లేకపోలేదు. ఇక ఇలాంటి కార్యాచరణ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉండరు. దీంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఏ అధికారిని ఈ ముప్పై రోజులు కదిలించినా సదరు కార్యక్రమం గురించే చెప్తూ తమ గోడు వెళ్లబోసుకుంటారు .ఇక ముప్పై రోజుల కార్యాచరణపై దృష్టి పెట్టే అధికారులు ఆఫీసుల్లో పెండింగ్ ఫైల్స్ విషయంలో అసహనానికి గురవుతారు. ఇక పని తీరుపై నెగటివ్ మార్కులు ఉంటాయన్న భావనతో అటు పరుగెత్తలేక, ఇటు ఆఫీసు పనులు పూర్తి చెయ్యలేక నానా ఇబ్బందులు పడతారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు పడకేస్తాయని ఆగ్రహం
ప్రభుత్వ కార్యాలయాల్లో జరగాల్సిన పనులు ముందుకు సాగకుండా, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అందుకే ప్రజలు సీఎంగా కెసిఆర్ ఆలోచన మంచిదే అయినప్పటికీ, ఓ 30 రోజులపాటు, లేదా కొద్దిరోజులపాటు యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే తీవ్ర అసహనానికి లోనవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరాయంగా చేయాల్సిన పనులను, ఒక 30 రోజుల్లోనూ, లేదా ఒక సమయాన్ని ఇచ్చో పూర్తి చేయమని చెప్పడం ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల జాప్యానికి కారణమవుతుంది. సర్పంచులకు లక్ష్యాలను నిర్దేశించడం కరెక్ట్ అయినప్పటికీ, గ్రామాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు నిరంతరాయంగా కొనసాగాలి.
ఎవరికీ ఇబ్బంది లేకుండా , ఒత్తిడి లేకుండా నిరంతరం కొనసాగాల్సిన ప్రణాళిక అంటున్న ప్రజలు
అవి ఒక 30 రోజులకు మాత్రమే పరిమితం కాకూడదు అన్నది గ్రామ ప్రజల వాదన. హరితహారం మొక్కలు కాపాడాల్సిన బాధ్యత ఎప్పటికీ అధికారులపై ఉండాలి. అలాగే ప్రజా సమస్యలను పరిష్కరించడం తోపాటు, సంక్షేమ పథకాలను అందించడం, పచ్చదనాన్ని కాపాడటం నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ. కాబట్టి సీఎం కేసీఆర్ కార్యాచరణ ప్రణాళిక మంచిదే అయినప్పటికీ, దానివల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు జరుగుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతరాయంగా అధికారులతోనూ, గ్రామ సర్పంచ్ లతోనూ ప్రణాళికాబద్ధంగా పని చేయించాలి అని అది ఎప్పటికీ కొనసాగాలని ప్రజలు కోరుతున్నారు. ఒక ముప్పై రోజుల పాటు అధికారుల మీద, సర్పంచుల మీద ఒత్తిడి పెట్టేబదులు ఎప్పటికీ వారి పనులు సజావుగా సాగేలా మానిటర్ చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది.