చంద్రబాబు ఫ్రెండ్, మరిన్ని అధికారాలు కావాలి: కేసీఆర్కు కరుణానిధి దిశానిర్దేశనం
Recommended Video
చెన్నై: తమకు సంబంధం లేని అంశాలను కేంద్రం రాష్ట్రాలకు బదలాయించాలని, రాష్ట్రానికి మరిన్ని నిధులు, అధికారాలు రావాలని, ఫెడరల్ ఫ్రంట్ కోసం ఇది ప్రారంభం లేదా ముగింపు కాదని మరిన్ని చర్చలు జరుపుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం అన్నారు.
ఫెడరల్ ఫ్రంట్: కరుణానిధి, స్టాలిన్లతో కేసీఆర్ భేటీ
ఆయన డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, డీఎంకే అధినేత కరుణానిధితో భేటీ అయిన విషయం తెలిసిందే. స్టాలిన్, కేసీఆర్లు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆయన నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఇరువురు కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పోవాలన్నారు.
చాలాకాలం తర్వాత చెన్నైకి వచ్చా
దేశంలో గుణాత్మక మార్పులు రావాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు సహా చాలా అంశాలపై స్టాలిన్తో చర్చించినట్లు తెలిపారు. దేశంలోని పరిణామాలపై చర్చించామన్నారు. తాను చాలా కాలం తర్వాత చెన్నైకు వచ్చానని చెప్పారు. రాజకీయాల్లో మార్పు ఆవశ్యకతపై మమతా బెనర్జీతోను చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు, నిధులు ఇవ్వాలి
విద్య, వైద్య, తాగునీటి వంటి ఎన్నో అంశాలను కేంద్ర ప్రభుత్వాలు పరిష్కరించలేకపోయాయని కేసీఆర్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు దేశ అభివృద్ధికి సహకరించేలా లేవన్నారు. రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు, నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము ఆలోచనలను పంచుకుంటున్నామని చెప్పారు.
చంద్రబాబు మంచి మిత్రుడు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును సంప్రదిస్తారా అని ఓ విలేకరి అడగగా.. కేసీఆర్ స్పందించారు. ఆయన తన మిత్రుడు అని, చాలాకాలం పాటు కలిసి పని చేశామని తెలిపారు. ఆయనతో కూడా చర్చిస్తామన్నారు. అందరితోను మాట్లాడుతామని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఇక్కడ చర్చించామని తెలిపారు. జపాన్ ఎంత వేగంగా అబివృద్ధి చెందుతుందో చూస్తున్నామని, మన వద్ద అలా లేదన్నారు. మేం ఎవరితో కలిసి పని చేస్తాం.. చేస్తున్నాం అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందన్నారు. మేం ఎప్పుడు ప్రంట్ ఏర్పాడు చేస్తామని చెప్పలేదని, మీడియానే ప్రచారం చేసిందన్నారు.
కరుణానిధి ఆప్యాయంగా పలకరించారు, దిశానిర్దేశనం
కరుణానిధి తనను ఆప్యాయంగా పలకరించారని కేసీఆర్ చెప్పారు. దేశ రాజకీయాలపై తనకు దిశా నిర్దేశనం చేశారన్నారు. కేంద్రం రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలన్నారు. భారత్ లౌకిక దేశమని వ్యాఖ్యానించారు. గుణాత్మక మార్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. రాజకీయాలు, పరిపాలనలో మార్పు కోసమే ఫెడరల్ ఫ్రంట్ అన్నారు.
కలిసి పని చేశాం, ఇలాగే సాగుతాం
డీఎంకే, టీఆర్ఎస్ పార్టీలు యూపీఏ 1లో కలిసి పని చేశాయని కేసీఆర్ చెప్పారు. తమ స్నేహం మున్ముందు కూడా కొనసాగుతుందన్నారు. తెలంగాణలో భూరికార్డులు ప్రక్షాళన చేశామన్నారు. కేంద్రంతో సంబంధంలేని అంశాలను రాష్ట్రాలకు బదలాయించాలన్నారు. కేంద్రం విదేశీ వ్యవహారాలపై దృష్టి సారించాలన్నారు. రైతులకు మే 10 నుంచి ఎకరాకు రూ.8000 పంట పెట్టుబడి అందిస్తున్నామని చెప్పారు.
స్టాలిన్కు ఆహ్వానం
రైతు బంధు పథకం ప్రారంభం రోజు (మే 10) తెలంగాణ రావాల్సిందిగా స్టాలిన్ను ఆహ్వానిస్తున్నానని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇది ప్రారంభం కాదని, ముగింపు కాదని, మరిన్ని చర్చలు జరుపుతామని చెప్పారు. ఆదాయాన్ని రాష్ట్రాల మధ్య సమానంగా పంచాలన్నారు. దేశంలోని యువతకు మరిన్ని అవకాశాలు రావాల్సి ఉందని చెప్పారు. అంతకుముందు స్టాలిన్ మాట్లాడుతూ.. కరుణానిధి ఆరోగ్యంపై కేసీఆర్ ఆరా తీశారని చెప్పారు.
స్టాలిన్ ఘన స్వాగతం
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభించిన కేసీఆర్ ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన కరుణానిధి నివాసానికి చేరుకున్నారు. స్టాలిన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కరుణానిధితో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. కరుణానిధి కొన్ని పుస్తకాలను కేసీఆర్కు బహుకరించారు.
స్టాలిన్ నివాసంలో కేసీఆర్ భోజనం
ఆ తర్వాత స్టాలిన్ నివాసానికి చేరుకున్న కేసీఆర్ అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై స్టాలిన్లో సమాలోచనలు జరిపారు. ఈరోజు రాత్రికి చెన్నైలోనే బస చేయనున్న కేసీఆర్ రేపు ఉదయం మరికొంత మంది నేతలతో సమావేశం కానున్నారు. కేసీఆర్ వెంట ఎంపీలు కేశవరావు, వినోద్, మంత్రి ఈటల రాజేందర్ తదితరులు ఉన్నారు.