ఆ గ్రామానికి మహర్దశ... దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్... రూ.100కోట్లతో అభివృద్ది...
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్నారు. గజ్వేల్లోని తన వ్యవసాయ క్షేత్రం ఉన్న ఎర్రవెల్లి గ్రామం తరహాలో వాసాలమర్రిని కూడా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం రూ.100 కోట్లు కేటాయిస్తామని,గ్రామంలో ప్రతీ ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే అంతకంటే ఎక్కువ నిధులు కేటాయిస్తామన్నారు. ఆదివారం(నవంబర్ 1) ఎర్రవల్లి ఫామ్ హౌస్లో వాసాలమర్రి నేతలు కేసీఆర్ను కలవగా ఈ హామిలిచ్చారు.
Recommended Video
10 రోజుల్లో వాసాలమర్రికి కేసీఆర్...
వాసాలమర్రి అభివృద్దికి సంబంధించి వెంటనే ఒక బ్లూప్రింట్ తయారుచేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గ్రామానికి చెందిన నేతలు జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్తో మాట్లాడి బ్లూ ప్రింట్పై చర్చించాలన్నారు. అలాగే నిజామాబాద్లోని అంకాపూర్ అభివృద్దిని వాసాలమర్రి గ్రామస్తులకు చూపించాలని... త్వరలోనే వారికి అక్కడికి తీసుకెళ్లాలని ఆదేశించారు. మరో 10 రోజుల్లో తానే స్వయంగా గ్రామానికి వచ్చి సహపంక్తి భోజనం చేస్తానని స్పష్టం చేశారు.
ఆ మార్గంలో వెళ్లినప్పుడల్లా నిరసన...
ఎర్రవెల్లి-యాదాద్రి రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తుండటంతో వాసాలమర్రిలో చాలామంది భూములు,ఇళ్లు కోల్పోతున్నారు. సీఎం కేసీఆర్ ఈ మార్గంలో వెళ్లినప్పుడల్లా తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇదే క్రమంలో శనివారం(అక్టోబర్ 31) జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగొస్తుండగా.. గ్రామస్తుల నిరసనను సీఎం గమనించారు. దీంతో కారు నుంచి దిగి వారితో మాట్లాడారు. గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు,భూములు,ప్రభుత్వ స్కూల్,గుడి పోతున్నాయని గ్రామస్తులు తెలిపారు. దీనిపై చర్చించేందుకు గ్రామ పంచాయతీ అధికారులను కేసీఆర్ ఆదివారం ఫామ్ హౌస్కు పిలిపించారు.
అధికారులకు ఆదేశాలు...
సుమారు రెండు గంటల పాటు వాసాలమర్రి గ్రామ అధికారులు,నేతలతో కేసీఆర్ ముచ్చటించారు.ఈ సందర్భంగా ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్,ఇతర అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. గ్రామ అభివృద్ది నమూనా రూపకల్పన కోసం డీఆర్డీవో పీడీ ఉపేందర్ రెడ్డిని స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. గ్రామ అభివృద్దికి రూ.100 కోట్లు కేటాయిస్తామని.... అవసరమైతే మరిన్ని నిధులు కూడా ఇస్తామని ప్రకటించారు. నెల రోజుల్లోనే గ్రామ రూపు రేఖలు మారేలా యుద్దప్రాతిపదికన అభివృద్ది పనులు జరిగేలా కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. సీఎం నిర్ణయంపై వాసాలమర్రి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.