యాగంపై కెటిఆర్ ట్వీట్, మహాపూర్ణాహుతి: బాబును కౌగిలించుకున్న కెసిఆర్
మెదక్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మెదక్ జిల్లా ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న ఆయుత చండీయాగంలో ఆదివారం మధ్యాహ్నం స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. దీనిపై మంత్రి కెటి రామారావు ట్విట్టర్ ద్వారా స్పందించారు.
ఆయుత చండీయాగం సందర్భంగా అగ్ని ప్రమాదం అనుకోకుండా జరిగిందని, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని పేర్కొన్నారు. యాగంలోని చివరి ఘట్టం మరికొద్దిసేపట్లో ముగుస్తుందని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
మహా పూర్ణాహుతికి గవర్నర్ దంపతులు
గత ఐదు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్న అయుత చండీయాగం ఆదివారం మహా పూర్ణాహుతి కార్యక్రమంతో ముగుస్తోంది. ఈ పూర్ణాహుతిలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. యాగశాలలో సీఎం కేసీఆర్ దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
చంద్రబాబును ఆలింగనం చేసుకున్న కేసీఆర్
అంతకుముందు అయుత చండీయాగం వేదిక వద్ద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. చంద్రబాబుకు మేళతాళాలతో స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఆహ్వానించారు. సంప్రదాయ వస్త్రంతో యాగం వద్ద పూజలో పాల్గొన్నారు.
చంద్రబాబు రాకను గురించి ముందుగానే తెలుసుకున్న కేసీఆర్ స్వయంగా చంద్రబాబుకు స్వాగతం పలికారు. చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఆపై అక్కడ ప్రతిష్ఠించిన అమ్మవారిని దర్శనం చేయించి, విశిష్ట అతిథుల వేదికపై చంద్రబాబును సన్మానించారు. ఈ సందర్భంగా యాగం జరుగుతున్న తీరును చంద్రబాబుకు కేసీఆర్ వివరించారు.