కేసీఆర్ బర్త్డే పిక్: 2600 మందితో..120 అడుగుల ఎత్తు నుంచి క్లిక్.. వైరల్!
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఆయన 66వ పడిలో అడుగు పెట్టనున్నారు. కేసీఆర్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న సిద్ధిపేట్ జిల్లాలోని గజ్వేల్లో రెండురోజుల కిందటే పుట్టినరోజు వేడుకలు ఆరంభం అయ్యాయి. వేలాది మొక్కలను నాటి.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను చెప్పడానికి సన్నాహాలు చేస్తున్నారు గజ్వేల్కు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేసీఆర్కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. 2600 మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ ముఖాకృతిలో నిల్చుని, కనువిందు చేశారు. కేసీఆర్ 66వ పుట్టినరోజు సందర్భంగా 66 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థానిక గ్రౌండ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గజ్వేల్లోని మైదానంలో 66 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2600 మంది తమ అభిమాన నేత కేసీఆర్ ముఖాకృతిలో నిల్చున్నారు. దీన్ని 120 మీటర్ల ఎత్తు నుంచి డ్రోన్ కెమెరాతో క్లిక్ మనిపించారు.
కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని గజ్వేల్ సహా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మొక్కలు నాటారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో మొక్కలను నాటాలని, హరిత హారం స్ఫూర్తిని కొనసాగించాలని ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. దీనితో శనివారం నుంచే మొక్కలను నాటే కార్యక్రమాలను చేపట్టారు. గజ్వేల్ సహా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న సిరిసిల్ల, సిద్ధిపేట్ నియోజకవర్గాల్లో హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.