
లతా మంగేష్కర్ భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం : సీఎం కేసీఆర్
ప్రముఖ గాయని, భారత రత్న లతా మంగేష్కర్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారతీయ సినీ సంగీత రంగంపై చెరగని ముద్ర వేశారన్నారు. ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఎనిమిది దశాబ్దాల పాటు తన పాటతో సంగీత మాధుర్యాన్ని నింపారన్నారు.

లతాజీ మరణంతో సంగీత మహల్ ఆగిపోయింది.
లతా మంగేష్కర్ భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం అని సీఎం కేసీఆర్ అన్నారు. లతా జీ మరణంతో పాట మూగ బోయినట్లైందని, సంగీత మహల్ ఆగిపోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. భారతదేశానికి లతా మంగేష్కర్ ద్వారా గాంధర్వ గానం అందిందన్నారు. భారతదేశంలోని దాదాపు 20 భాషల్లో వెయ్యి సినిమాల్లో 50 వేలకుపైగా పాటలు పాడిన లతా మంగేష్కర్ జీ సరస్వతీ స్వర నిధి అని కేసీఆర్ పేర్కొన్నారు.

సరస్వతీ స్వర నిధి
వెండితెర మీది నటి హావభావాలను అనుగుణంగా ఆ నటియే స్వయంగా పాడుతుందా అన్నట్టు తన గాత్రాన్ని అందించారన్నారు కేసీఆర్. లతాజీ గొప్ప నేపథ్యగాయని. సాదారణంగా సినీ నిర్మాతలు మొదట హీరో హీరోయిన్లను ఖరారు చేసుకున్న తర్వాత సినిమాను ప్రారంభించేవారు. కానీ, సింగర్గా లతా మంగేష్కర్ సమయం ఇచ్చిన తర్వాతే సినిమా షూటింగ్ ప్రారంభించే వారంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చన్నారు.

లతా జీ లేని లోటు పూరించలేనిది
పాటంటే లతా జీ.. లతా జీ అంటే పాట అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సప్త స్వరాల తరంగ నాదాలలో శ్రోతలను తన్మయత్వంలో వోలలాడించిన లతా మంగేష్కర్, ఉత్తర దక్షిణాదికి సంగీత సరిగమల వారధన్నారు.. హిందుస్థానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ వద్ద నేర్చుకున్న లతాజీ.. ఉర్దూ కవుల సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల, తన గాత్రంలో ఉర్దూ భాషలోని గజల్ గమకాల సొబగులను వొలికించేదన్నారు. కొందరికి పురస్కారాల వల్ల గౌరవం వస్తే.., దేశ విదేశాల వ్యాప్తంగా ఆమెకు అందిన లెక్క లేనన్ని పురస్కారాలకు లతా జీ వల్ల గౌరవం దక్కింది. ఎందరో గాయకులు రావచ్చు కానీ లతా జీ లేని లోటు పూరించలేనిదని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.