మాకు ఆనందం: జార్ఖండ్లో జేఎంఎం ఘన విజయంపై సీం కేసీఆర్
న్యూఢిల్లీ/హైదరాబాద్: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) అధినేత హేమంత్ సోరెన్కు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి హేమంత్ సోరెన్ తండ్రి శిబుసోరెన్, హేమంత్ సోరెన్ మద్దతు తెలిపారని గుర్తు చేసుకున్నారు.
జేఎంఎం పార్టీ జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రజలకు ఆనందకర విషయమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్కు ఈ సందర్భంగా కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజాతీర్పును గౌరవిస్తామన్న అమిత్ షా
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై ఫలితాలపై కేంద్ర హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ అధినేత అమిత్ షా స్పందించారు. ప్రజలు ఎలాంటి తీర్పును ఇచ్చినా తాము స్వీకరిస్తామని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అమిత్ షా వ్యాఖ్యానించారు.
ఐదేళ్లపాటు పాలన బీజేపీకి ఇచ్చినందుకు గానూ జార్ఖండ్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు చేసిన అవిరామ కృషిని అభినందనీయమన్నారు. కాగా, జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ కూడా జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.
హేమంత్ సోరెన్కు ప్రధాని శుభాకాంక్షలు
జార్ఖండ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం పార్టీ అధినేత హేమంత్ సోరెన్కు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం సొంత చేసుకున్నందుకు వారికి కృతజ్ఞతలు అని ప్రధాని ట్వీట్ చేశారు.
గతంలో జార్ఖండ్ రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం బీజేపీకి ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన బీజేపీ కార్యకర్తలు, నేతలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర బీజేపీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని తెలిపారు.
కాగా, 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ రాష్ట్రంలో 47 స్థానాల్లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి 47 స్థానాలకుపైగా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బీజేపీ 24 స్థానాల్లో మాత్రమే ఆధిక్యాన్ని ప్రదర్శించింది. పూర్తి ఫలితాలు మంగళవారం లోగా వెలువడే అవకాశం ఉంది.