కేసీఆర్ యాదాద్రి పర్యటనలో ఆసక్తికరం: కోతులకు అరటిపండ్లు పంచిన సీఎం
యాదాద్రిభువనగిరి: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామివారిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
కోతులను గమనించి..
కరోనా నిబంధనలను అనుగుణంగా మార్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ఆలయ ద్వారం బయట నుంచే సీఎం కేసీఆర్ దైవ దర్శనం చేసుకున్నారు. కాగా, సీఎం కేసీఆర్ తిరుగు ప్రయాణంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కరోనా కారణంగా భక్తుల రాక తగ్గడంతో కోతులకు ఆహరం దొరక్క అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాయి. వీటిని గమనించిన కేసీఆర్.. తన వాహనాన్ని ఆపారు.
కోతులకు స్వయంగా అరటిపండ్లు పంచిన కేసీఆర్
కోతుల గుంపు దగ్గరకు వెళ్లిన సీఎం కేసీఆర్.. స్వయంగా కోతులకు అరటిపండ్లను అందించి వాటి ఆకలి తీర్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కేసీఆర్, టీఆర్ఎస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా కేసీఆర్ మనసున్న ముఖ్యమంత్రి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
యాదాద్రి అభివృద్ధి పనులు పరిశీలించిన కేసీఆర్..
ఇక యాదాద్రి ఆలయ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ క్షేత్ర అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల సమాచారాన్ని ఆయన అధికారులను అడిగితెలుసుకున్నారు. ఆలయం చుట్టూ నిర్మిస్తున్న ఆరు వరుసల రింగ్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఘాట్ రోడ్డులో మొక్కల పెంపకం పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
పూర్తికావస్తున్న ఆలయ పనులు
కాగా, ఇటీవల మహాబలిపురం నుంచి తెప్పించిన విగ్రహాల అమరిక పనులు పూర్తి చేస్తున్నారు. దర్శన సముదాయం, ప్రసాద కాంప్లెక్స్, శివాలయం, పుష్కరిణి పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఆలయానికి నలుదిక్కులా కృష్ణశిల రాతి విగ్రహాలు సింహం, ఐరావతం, శంకు చక్రాలు, గరుత్మంతుని విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నింటికి సంబంధించిన వివరాలను అధికారులు వివరించగా.. సీఎం కేసీఆర్ వారికి పలు కీలక సూచనలు చేశారు.