కేసీఆర్ 'ఊ' అనడమే ఆలస్యం : భయంతో బిక్కచచ్చిపోతున్న నేతలు
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీంతో పలువురు నేతలకు సంబంధాలున్నట్లు పోలీసులు నిర్దారించిన నేపథ్యంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న భయంతో సదరు నేతలు లోలోపలే బిక్క చచ్చిపోతున్నట్లుగా తెలుస్తోంది. నయీంతో లింకుల విషయంలో అధికార ప్రతిపక్ష అన్న తేడాలకు తావివ్వకుండా.. అందరిపై కొరడా ఝలిపించడానికి సీఎం కేసీఆర్ రెడీ అయినట్టుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
నయీంతో లింకులున్న నేతల అసలు బాగోతాన్ని త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల సాక్షిగా కేసీఆర్ బహిర్గతం చేయబోతున్నారన్న వార్త.. ఇప్పుడు సదరు నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అధికార పక్షం కుట్ర అని కొంతమంది నేతలు టీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తుండడంతో.. పోలీసులు ఇచ్చిన నివేదికలతో పక్కా ఆధారాలతోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు నేతలను అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్దమైనట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో.. అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని భావిస్తోన్న సీఎం కేసీఆర్ నయీంతో సంబంధాల విషయంలో అధికార పార్టీ నేతలను సైతం ఉపేక్షించకూడదనే అభిప్రాయంతో ఉన్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో అరెస్టులు గనుక మొదలైతే.. సొంత పార్టీ నేతలను సైతం బయటకు లాగడానికి కేసీఆర్ వెనుకాడరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారం పక్ష కుట్ర అని అవతలి పార్టీ వ్యక్తులు ఆరోపణలైన చేస్తారేమో గానీ.. సొంత పార్టీ అధినేతే అరెస్టులకు ఆదేశాలిస్తే.. నయీంతో సంబంధాలున్న టీఆర్ఎస్ నేతల పరిస్థితి ఇక అగమ్యగోచరమే.
ఏదేమైనా నయీంతో పలువురు నేతలకు ఉన్న సంబంధాలు బయటపడుతున్న నేపథ్యంలో.. విషయాన్ని కేసీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నారన్నది మాత్రం అర్థమవుతోంది. ఇప్పుడు సదరు నేతల భవిష్యత్తు అంతా కేసీఆర్ చేతుల్లోనే ఆధారపడి ఉంది. మరి కేసీఆర్ ఈ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తూ.. నయీంతో లింకులు ఉన్న నేతలను అరెస్ట్ చేయిస్తారా? లేక.. ఉదాసీన వైఖరికి తావిచ్చి దీనిపై నెలకొన్న ఉత్కంఠను ఉసూరుమనిపిస్తారా? అన్నది ప్రస్తుతం అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. అందరి సంగతి పక్కనబెడితే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు మాత్రం ఇప్పుడు కాలరాత్రులే.