రివ్యూలో కేసీఆర్ ఏం చర్చించారు.. లాక్ డౌన్పై తేల్చేసినట్టేనా.. ప్రజాభిప్రాయం కోరబోతున్నారా?
కేంద్ర ప్రభుత్వం పొడగించిన లాక్ డౌన్ విషయంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశాయి. చాలావరకు రాష్ట్రాలు లాక్ డౌన్ను పొడగిస్తూనే కేంద్రం ఇచ్చిన సడలింపులను స్వాగతించాయి. జార్ఖండ్ లాంటి రాష్ట్రంలో మాత్రం సడలింపులకు తావు లేకుండా పూర్తి స్థాయిలో రెండు వారాల లాక్ డౌన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే సడలింపులపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మద్యం షాపులు తెరిచేందుకు అనుమతులు కూడా ఇచ్చారు. ఇక తెలంగాణ విషయంలోనే ఇంకా ఏ స్పష్టత రాలేదు. మంగళవారం(మే 5) జరగబోయే కేబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో లాక్ డౌన్పైముఖ్యమంత్రి కేసీఆర్ సూచనప్రాయంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
పొడగించడమే ఉత్తమం..
తెలంగాణలో లాక్డౌన్ను మరో రెండు వారాలపాటు పొడిగించాలని ఆదివారం నాటి సమీక్షా సమావేశంలో అధికారులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటం.. కేంద్రం కూడా లాక్ డౌన్ను పొడగించిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ లాక్ డౌన్ పొడగించడమే ఉత్తమం అని అధికారులు అభిప్రాయపడినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ప్రతిపాదనకు సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా గుర్తించిన కంటైన్మెంట్ జోన్లలో క్వారంటైన్ గడువు ఈ నెల 21న ముగుస్తుండటం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణంగా తెలుస్తోంది.
సడలింపులకు ఓకె చెప్పేనా..?
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు,లాక్ డౌన్ సడలింపు అంశంపై కేసీఆర్ లోతుగా చర్చ జరిపినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వలస కార్మికుల తరలింపు విషయంలో కేంద్ర వైఖరిపై చర్చ జరిగినట్టు సమాచారం. అనుకోని పరిస్థితుల్లో వచ్చి చిక్కుకుపోయిన కార్మికులను మాత్రమే స్వస్థలాలకు పంపించాలని కేంద్రం మెలిక పెట్టడంపై అధికారులతో చర్చించారు. కేంద్రం చెప్పినట్టు చేస్తే వలస కార్మికుల నుంచి ఎదురయ్యే ప్రతిఘటనను,పరిణామాలను చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే గ్రీన్ జోన్లలో సడలింపులకు అవకాశం ఇవ్వాలా.. ఇస్తే వేటికి అనుమతినివ్వాలి.. ఎలాంటి నిబంధనలు అమలుచేయాలి అని సీఎం చర్చించినట్టు సమాచారం.
Recommended Video
ప్రజాభిప్రాయం..
కరోనా లాక్ డౌన్ పొడగింపు.. సడలింపులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మంగళవారం మరోసారి సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయించారు. మంగళవారం నాటి భేటీలో తుది నిర్ణయాన్ని ఖరారు చేసి... బుధవారం జరిగే కేబినెట్ భేటీలో దానిపై చర్చించనున్నారు. అదే సమయంలో లాక్ డౌన్ పొడగింపుపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరపాలని కేసీఆర్ నిర్ణయించారు. మంత్రులు,ఎమ్మెల్యేల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని లాక్ డౌన్ పొడగింపుపై ఒక నిర్ణయానికి రానున్నారు.