కేంద్రం తీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి.... 'జీఎస్టీ'పై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ
జీఎస్టీ పరిహారం చెల్లింపులో కేంద్రం జాప్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించిన సీఎం... వెంటనే ఈ ఆలోచన విరమించుకోవాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. కేంద్రం చర్యలు సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం(సెప్టెంబర్ 1) ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.
Recommended Video
అవసరాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వమే రుణాలు తీసుకుని రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలని కేసీఆర్ పేర్కొన్నారు. చట్టంలో పేర్కొన్న ప్రకారం 14 శాతం వృద్ధి రేటు ఆధారంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గితే.. కేంద్రమే దాన్ని భర్తీ చేయాలని గుర్తు చేశారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం తప్పనిసరిగా చెల్లిస్తామని చట్టంలో చెప్పి... తీరా ఇప్పుడు దాన్ని ఉల్లంఘించడం సరైనదేనా అని ప్రశ్నించారు.
జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చి జీఎస్టీ బిల్లును సమర్థించామని కేసీఆర్ పేర్కొన్నారు.జీఎస్టీపై మొట్టమొదట స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించింది తెలంగాణ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. జీఎస్టీ ఫలాలు దీర్ఘ కాలం అందుతాయని... తద్వారా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పెరుగుతాయని ఆశించినట్లు చెప్పారు.
అప్పట్లో యూపీఏ సర్కార్ సీఎస్టీని రద్దు చేసినప్పుడు పూర్తి పరిహారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చిందని... కానీ రాష్ట్రాలు దాన్ని తిరస్కరించాయని కేసీఆర్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల ఒత్తిడి మేరకు రెవెన్యూ నష్టాన్ని పూడ్చేందుకు ప్రతీ 2 నెలలకొకసారి పూర్తి జీఎస్టీ పరిహారం చెల్లించేలా చట్టంలో నిబంధన ఉందన్నారు. అయినప్పటికీ జీఎస్టీ చెల్లింపుల్లో జాప్యం జరుగుతూనే ఉందని.. ఏప్రిల్ నుంచి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందలేదని అన్నారు.
Telangana CM writes to PM Modi over GST compensation to States. The letter states "Decision of asking states to meet the shortfall in compensation through borrowings may be reversed." pic.twitter.com/FMtUb2yUhm
— ANI (@ANI) September 1, 2020
కరోనా పరిస్థితుల కారణంగా ఏప్రిల్,2020లో తెలంగాణ ప్రభుత్వం 83 శాతం రెవెన్యూను నష్టపోయిందన్నారు.అదే సమయంలో కరోనా కట్టడికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చిందని... రాష్ట్రాల అవసరాలు, పేమేంట్ల భారం కూడా పెరిగిపోయిందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ,విత్త విధానం కేంద్రం చేతిలో ఉన్నందునా రాష్ట్రాలకు వేరే ఆప్షన్ లేక విధిగా కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితులు తలెత్తాయన్నారు.