నూతన సీఎస్ గా అజయ్ మిశ్రా: సీఎం కేసీఆర్ మొగ్గు..! రేసులో సోమేశ్ కుమార్..కానీ...!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులు కానున్నారు. ఈ అంశం పైన ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలతో పాటు రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది. ప్రస్తుత సీఎస్ శైలేంద్రకుమార్ జోషి ఈ సాయంత్రం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త సీఎస్ నియామకం పైన ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కొత్త సీఎస్ రేసులో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్మిశ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ముందంజ లో ఉన్నారు. అయితే, మరి కాసేపల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దీని పైన అధికారికంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ సాయంత్రం నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు స్వీకరిస్తారు.
కొత్త సీఎస్ గా అజయ్ మిశ్రా..!
తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత సీఎస్ ఎస్కే జోషీ ఈ రోజు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో..కొత్త సీఎస్ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియారిటీ, సమర్థతలను పరిగణనలోకి తీసుకుని కొత్త సీఎస్ ఎంపికపైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కొత్తగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా దక్కించుకొనేందుకు ప్రధానంగా ఇద్దరు సీనియర్ అధికారులు రేసులో ఉన్నారు.
వారిద్దరి పైనే సీఎం చర్చించినట్లుగా విశ్వస నీయ సమాచారం. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్మిశ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ముందంజ లో ఉన్నారు. 1985 బ్యాచ్కు చెందిన మిశ్రాకు సీనియారిటీ కలిసి వస్తుండటంతో ఆయననే సీఎస్గా నియమించే అవకాశాలు అధికంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సోమేశ్ పైనా ఆలోచన చేసినా...
అదే సమయంలో..1989 బ్యాచ్కు చెందిన సోమేశ్కుమార్ పనితీరు పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న సానుకూల దృక్పథం కూడా కొత్త సీఎస్ ఎంపికలో కీలకంగా మారే అవకాశముంది. మిశ్రాను సీఎస్గా నియమిస్తే 2020 జూన్ వరకు పదవి లో కొనసాగుతారు. ఆ తర్వాత సోమేశ్కుమార్కు సీఎస్గా అవకాశం కల్పించాలనే యోచనలో సీఎం ఉన్నట్టు సమాచారం.
సోమేశ్ కుమార్ పదవీ విరమణ సమయం 2023 డిసెంబర్ నెలాఖరుకు ఉంది. అసెంబ్లీ ఎన్నికల వరకు సీఎస్గా ఒకే అధికారిని కొనసాగించాలని ముఖ్యమంత్రి భావిస్తే మాత్రం.. జోషి వారసుడిగా సోమేశ్కుమార్ను సీఎస్గా నియమించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుండి అందుతున్న సమాచారం మేరకు అజయ్ మిశ్రాకే ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఎస్కే జోషీకి సన్మానం..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి పదవీ విరమణ సందర్భంగా ఈ రోజు సాయంత్రం తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్ 9వ అంతస్తులోని సమావేశ మందిరంలో ఆయనను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానించనున్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొననున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సీఎస్ పైన అధికారిక నిర్ణయం ప్రకటించిన వెంటనే ..దానికి అనుగుణంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. సాయంత్రం ఎస్కే జోషీ నుండి నూతన సీఎస్ బాధ్యతలు స్వీకరించనున్నారు.