కేసీఆర్తో అఖిలేష్ భేటీ: రాజకీయ పరిస్థితులపై 2 గంటలపాటు చర్చ, కేజ్రీవాల్తోనూ
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో కొత్త కూటమిని ఏర్పాటు విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ రాజధానికి వెళ్లిన విషయం తెలిసిందే. పలువురు కీలక నేతలతో భేటీ అవుతున్నారు. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్తో భేటీ అయ్యారు.

అఖిలేష్ యాదవ్తో కేసీఆర్ కీలక భేటీ.. తాజా రాజకీయాలపై చర్చ
ఢిలోని కేసీఆర్ నివాసంలో రెండు గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్, అఖిలేష్ యాదవ్.. దేశంలోని తాజా పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలు, ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరం గురించి ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రపతి ఎన్నిక విషయంపైనా చర్చించినట్లు సమాచారం.

ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్తో కేసీఆర్ భేటీ.. పంజాబ్కు
కాగా, శనివారం సాయంత్రం ల్లీలోని మొహల్లా క్లినిక్ను సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్తో కలిసిన సీఎం కేసీఆర్.. మొహల్లా క్లినిక్ సందర్శించారు. మోతీబాగ్లో ఉన్న సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. సీఎం కేజ్రీవాల్ స్వయంగా కేసీఆర్కు సర్వోదయ పాఠశాలను చూపించారు. అనంతరం అక్కడి సిబ్బంది పాఠశాల ప్రత్యేకతలు, విద్య, సదుపాయాలను కేసీఆర్ కు వివరించారు. వసతులకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. కాగా, ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చండీగఢ్కు వెళ్లనున్న కేసీఆర్.. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు.

పంజాబ్ రైతులకు చెక్కులివ్వనున్న కేసీఆర్
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్లతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఆ తర్వాత, మే 26వ తేదీ ఉదయం బెంగళూరులో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మాజీ భారత ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమవుతారు.మే 27వ తేదీన బెంగుళూరు నుంచి సీఎం కేసీఆర్ రాలేగావ్ సిద్ది పర్యటనకు వెళతారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సీఎం కేసీఆర్ భేటీ అవుతారు.

బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లోనూ కేసీఆర్ పర్యటనలు
అనంతరం సాయిబాబా దర్శనం కోసం సీఎం కెసిఆర్ షిర్డీ వెళతారు. అక్కడ నుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు.మే 29 లేదా 30వ తేదీన బంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్నారు. గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదుకోనున్నారు. కాగా, ఈ దేశ వ్యాప్త పర్యటనల్లో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.