తెలంగాణకు వస్తా, చూస్తా: కనిమొళితో కేసీఆర్ భేటీ, 2019లో ఎక్కువ సీట్లు
చెన్నై: తాను త్వరలోనే తెలంగాణకు వస్తానని, కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులు చూస్తానని డీఎంకే ఎంపీ కనిమొళి సోమవారం అన్నారు. రెండు రోజుల తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కే చంద్రశేఖర రావు మధ్యాహ్నం కనిమొళితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ అంశంపై చర్చ జరిగింది.
చంద్రబాబు ఫ్రెండ్, మరిన్ని అధికారాలు కావాలి: కేసీఆర్కు కరుణానిధి దిశానిర్దేశనం
ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని కనిమొళి అన్నారు. రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలు మరింత ఐక్యంగా పని చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టు, భూరికార్డుల ప్రక్షాళనతోపాటు రైతులకు పంట పెట్టుబడి సాయం పథకాలను కనిమొళికి కేసీఆర్ వివరించారు.
2019లో బీజేపీ-కాంగ్రెస్ల కంటే ఎక్కువ సీట్లు
ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే సమాఖ్య స్ఫూర్తి అవుతుందని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. 2019లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలన్నారు. అదే తన ఆకాంక్ష అన్నారు.
చెన్నైలో కేసీఆర్ బిజీబిజీ
ఆదివారం చెన్నై వెళ్లిన కేసీఆర్ బిజీబిజీగా గడిపారు. తొలుత కరుణానిధి, స్టాలిన్లతో భేటీ అనంతరం ఆదివారం చెన్నైలోని ప్రత్యేక కపాలేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. సాయంత్రం ఓ హోటల్లో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్నారు. కేసీఆర్కు తమిళనాడులో ఘన స్వాగతం లభించింది. తొలుత గోపాలపురం రోడ్డులోని కరుణ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత అల్వార్పేటలోని స్టాలిన్ నివాసానికి వెళ్లారు.
కేసీఆర్తో చేతులు కలపడం సంతోషం
కేసీఆర్కు స్టాలిన్ ఆహ్వానం పలికిన సమయంలో డీఎంకే కార్యకర్తలు.. దేశానికి నేత కేసీఆర్ జిందాబాద్, కాబోయే సీఎం స్టాలిన్ జిందాబాద్ అంటూ నినదించారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి గురించి డీఎంకే పోరాటం చేస్తోందని ఎంకే స్టాలిన్ ఆదివారం అన్నారు. ఈ విషయంలో కేసీఆర్తో చేతులు కలుపటం సంతోషంగా ఉందన్నారు. తమ భేటీ సందర్భంగా ప్రస్తుత, భవిష్యత్తు రాజకీయ పరిస్థితులు, కేంద్రం-రాష్ట్రాల మధ్య సంబంధాలు, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అధికారాలు, నిధుల కేటాయింపు, రాష్ట్రాలకు మరింత ప్రతిపత్తి సహా అనేక అంశాలపై చర్చించామన్నారు.
కేసీఆర్తో ఇలాంటి సమావేశాలు
దేశంలో లౌకిక, సమాఖ్యస్పూర్తిని కాపాడాల్సిన అవసరం ఉందని స్టాలిన్ అన్నారు. కరుణానిధిని సీఎం కేసీఆర్ కలిసి ఆరోగ్యం గురించి వాకబు చేశారని వెల్లడించారు. దేశంలో లౌకికత్వాన్ని కాపాడాల్సిన ఆవశ్యకతను చర్చించామన్నారు. విద్య వంటి పలు అంశాలను కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదలాయించాలని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ చెప్పిన విషయాలపై తమ పార్టీ సీనియర్లతో కూడా చర్చిస్తానన్నారు. తమిళనాడులో భావ సారూప్యత ఉన్న ఇతర పార్టీలతో తాను కూడా మాట్లాడుతానన్నారు. ఇది తమ మొదటి సమావేశమేనని, రాష్ట్రాల హక్కులు, ఇతర అంశాలపై కేసీఆర్తో ఇలాంటి సమావేశాలు ఇంకా జరుగుతాయన్నారు.