గవర్నర్ను కలిసిన కేసీఆర్: కీలక అంశాలపై చర్చ, రేపు ఢిల్లీకి సీఎం, 3రోజులు అక్కడే, పీఎంతో భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం సాయంత్రం గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం.
Recommended Video
కీలక అంశాలపై చర్చ
ప్రధానంగా కంటి వెలుగు కార్యక్రమం జరుగుతోన్న తీరును కేసీఆర్ గవర్నర్కు వివరించినట్లు తెలిసింది. రైతుబీమా కింద రైతు కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధిత వివరాలను గవర్నర్కు వివరించినట్లు తెలిసింది.
భేటీకి ప్రాధాన్యత
శాసనసభ సమావేశాల నిర్వహణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా ఇరువురి భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. వచ్చే నెల 2వ తేదీన ప్రగతి నివేదన సభ, తాజా రాజకీయ పరిణామాలను గవర్నర్ దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లినట్లు సమాచారం. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గవర్నర్తో కేసీఆర్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్, సీఎస్ ఢిల్లీలో ఉన్నారు. వారిద్దరూ గురువారం ఎన్నికల సంఘం అధికారిని కలిసిన విషయం తెలిసిందే. ముందస్తు ఎన్నికలు ఉండవని కేసీఆర్ చెప్పినప్పటికీ జరుగుతున్న పరిణామాలు రాజకీయాలను మరోసారి వేడెక్కిస్తున్నాయి.
పెండింగ్ అంశాలే కీలకం
కాగా, శుక్రవారం సాయంత్రం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి.. అక్కడే మూడు రోజులపాటు మకాం వేయనున్నారు. ప్రధానితోపాటు కేంద్రమంత్రులను కూడా ఆయన కలుసుకోనున్నారు. తెలంగాణలోని పెండింగ్ అంశాలపై ఈ సందర్భంగా కేసీఆర్ వారితో చర్చించనున్నారు. హైకోర్టు విభజన, రీజనల్ రింగ్ రోడ్డుకు నిధులు, రక్షణ స్థలాల అప్పగింతపై కేసీఆర్ వారితో చర్చించనున్నారు. కొత్త జోనల్ వ్యవస్థకు కూడా ఆమోద ముద్ర వేయాలని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. పీఎంఓ చొరవతీసుకుని పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరనున్నారు.