బెజవాడ దుర్గమ్మకు తీర్చే మొక్కు ఇదే: కొండపై 'కేసీఆర్' నినాదాలు, వద్దన్న సెక్యూరిటీ
Recommended Video
విజయవాడ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గన్నవరం చేరుకుంటారు. ఎయిర్ పోర్టులో ఏపీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వర రావులు స్వాగతం పలుకుతారు.
కేసీఆర్ ఎయిర్ పోర్ట్ నుంచి వెటర్నరీ కళాశాల అతిథి గృహంకు చేరుకుంటారు. ఆ తర్వాత దుర్గమ్మ తల్లిని దర్శించుకునేందుకు బయలుదేరుతారు. అక్కడ అమ్మ వారికి ముక్కుపుడక సమర్పించుకుంటారు. కేసీఆర్ రాక కోసం విజయవాడలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద కేసీఆర్ కాన్వాయ్ కోసం 15 వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ తర్వాత ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి హైదరాబాద్ పయనం అవుతారు.
కాగా, ఆయన రావడానికి ముందే కేసీఆర్ జిందాబాద్ అంటూ ఇంద్రకీలాద్రిపై అభిమానులు నినాదాలు చేశారు. టీఆర్ఎస్ జెండా, ఫ్లెక్సీలతో కొండపైకి వచ్చారు. అయితే కొండపై రాజకీయ నినాదాలు చేయవద్దని భద్రతా సిబ్బంది వారించింది. ఫ్లెక్సీలు తొలగించాలని దుర్గగుడి భద్రతా సిబ్బంది సూచించింది.