డీల్ కుదిరిందా: ప్రధాని మోడీకి కెసిఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారా?
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో చేరుతుందని ఎప్పటికి అప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల సీఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా కెసిఆర్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.
వారి భేటీలో విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు, నిధులు తదితర అంశాల పైన చర్చించారు. అదే సమయంలో రాజకీయపరమైన అంశాలు కూడా చర్చించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ ప్రధాని మోడీకి ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది.
2019లో ఎన్డీయే కూటమికి సీట్లు తక్కువ పడినా తాము ఉన్నామని ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ చెప్పి ఉంటారనే ఊహాగానాల వినిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 17 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఇందులో కనీసం 15 సీట్లు వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారట.
వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత అవసరమైతే కనుక ఎన్డీయే కూటమికి మద్దతిచ్చేందుకు కూడా సిద్ధమని చెప్పి ఉంటారని అంటున్నారు. ఇప్పుడు ఎన్డీయేలో చేరినా కలిసే ఉంటామని కెసిఆర్ హామీ ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.
కేంద్రంలో టిఆర్ఎస్ చేరుతుందని, సీఎం కెసిఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు కేంద్రమంత్రి పదవి రావొచ్చునని ఎన్నో రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ భేటీలో ఈ అంశం కూడా చర్చకు వచ్చి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, బిజెపి, టిఆర్ఎస్ వర్గాలు మాత్రం వీటికి దూరం ఉంటున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 330కి పైగా సీట్లు గెలుచుకుంది. స్వయంగా బిజెపి 280కి పైగా సీట్లు గెలుచుకుంది. బిజెపి సీట్లే మేజిక్ ఫిగర్ దాటాయి. అయినప్పటికీ మిత్రపక్షంగా ఎన్నికల్లో పోటీ చేసినందున ప్రభుత్వాన్ని కూడా మిత్రపక్షాలతో ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీ భావించారు. అందుకే బిజెపితో పాటు మిగతా మిత్రపక్షాలకు కేంద్ర ప్రభుత్వంలో చోటిచ్చారు.