హైద్రాబాద్పై వరంగల్ ఎఫెక్ట్!: కెసిఆర్ ఆపరేషన్ ఎలక్షన్, దేశాన్ని నిమిషాల్లో..: రేవంత్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన వరంగల్ పర్యటనలో జిల్లా పైన పెద్ద ఎత్తున వరాలు కురిపించారు. హైదరాబాదును విశ్వనగరంగా చేస్తామని చెబుతున్న కెసిఆర్... తెలంగాణలో రెండో పెద్ద పట్టణమైన వరంగల్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు.
కెసిఆర్ వరంగల్ జిల్లాలో వరాల జల్లు వెనుక 'ఆపరేషన్ ఎలక్షన్' ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెలలో హైదరాబాదులో జిహెచ్ఎంసి ఎన్నికలు జరగనున్నాయి. అదే ఊపులో వరంగల్ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశాలు ఉండొచ్చంటున్నారు.
కొద్ది నెలల క్రితం జరిగిన వరంగల్ ఉప ఎన్నికలకు అధికార తెరాసకు మంచి ఊపును ఇచ్చాయి. తెరాస నేతలు ఇంకా ఆ ఉత్సాహంలో ఉన్నారనే చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు ఎక్కడ ఎన్నికలు నిర్వహించినా తమకు తిరుగు ఉండదని అభిప్రాయంతో ఉన్నారు.
మరోవైపు, కెసిఆర్ ఓరుగల్లులో పెద్ద ఎత్తున వరాలు కురిపించడం వెనుక 'గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు' కూడా ఓ కారణంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ ఉప ఎన్నికల సమయంలో తెరాస మంచి మెజార్టీతో గెలిచింది.
తమకు పట్టం కట్టిన వరంగల్ జిల్లా ప్రజలను వరాల జల్లులో ఉక్కిరిబిక్కిరి చేయడం ద్వారా.. కెసిఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఉండవచ్చునని అంటున్నారు. తద్వారా రాజధాని ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ఉండవచ్చునంటున్నారు.
విపక్ష కాంగ్రెస్, టిడిపి, బిజెపి నేతలు ఇటీవల గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ... వరంగల్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇస్తే కెసిఆర్ ఏం చేశారని, హైదరాబాదును కూడా పట్టించుకోరని, ఇప్పటికే హైదరాబాదును చెత్తసిటీ చేశారని ఆరోపిస్తున్నారు.
అభివృద్ధి చేసే వారికి ఓటేయండి: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేది టిడిపి, బిజెపియేనని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. టిడిపి-బిజెపి ఒక జట్టు, తెరాస-మజ్లిస్ ఓ జట్టు అన్నారు. తెరాసకు ఓటేస్తే మజ్లిస్కు ఓటు వేసినట్లే అన్నారు. భారత దేశాన్ని పది నిమిషాల్లో శ్మశానంగా మారుస్తామన్న వారికి ఓటెయ్యాలా వద్దా అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో దానం నాగేందర్ పాత్ర ఏమిటో ఆయనకే తెలియదన్నారు.