కారు పంపిస్తా.. విందుకు రండి: ఏపీ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఎందుకో తెలుసా?
హైదరాబాద్/అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ రైతుకు ఫోన్ చేశారు. కృష్ణా జిల్లా ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాదరావుకు ఫోన్ చేసిన కేసీఆర్.. వేద సాగు అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.
అంతేగాక, సుమారు 4 దశాబ్దాలుగా వ్యవసాయం, పాడి పరిశ్రమ, వ్యవసాయ అనుబంధ రంగాలలో విశేష కృషి చేసిన ప్రసాదరావును కేసీఆర్ స్వయంగా విందుకు ఆహ్వానించారు. ప్రసాదరావు అనుభవాలను తెలంగాణలో ఆచరణలోకి తీసుకొచ్చే అంశంపై ఆయనతో చర్చించనున్నారు.
Recommended Video
తనతో దాదాపు 10 నిమిషాలు ఫోన్లో సీఎం కేసీఆర్ సంభాషించారని, వేద పద్ధతిలో వరి సాగులో దిగుబడులు, ఖర్చు వివరాలు అడిగి తెలుసుకున్నారని ప్రసాదరావు తెలిపారు. రెండో రోజుల్లో తనను కలిసేందుకు కారు పంపుతానని సీఎం కేసీఆర్ చెప్పారని ఆయన వెల్లడించారు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు స్వయంగా ఫోన్ చేసి సాగు అనుభవాలు తెలుసుకోవడం, విందు ఆహ్వానించడం గర్వంగా ఉందని రైతు ప్రసాదరావు ఆనందం వ్యక్తం చేశారు. వేద సాగుతో ఖర్చులు తగ్గడమే గాక, దిగుబడి పెరుగుతుందన్న విషయం రైతులు గుర్తించాలన్నారు. వ్యవసాయంతోపాటు 250 గేదెలు, ఆవులు, మేకలు, కోళ్ల పెంపకం చేస్తున్నానని, దీని కారణంగా పొలానికి మంచి సేంద్రియ ఎరువులు అందుతున్నాయని.. భూమి మరింత సారవంతమై దిగుబడులు పెరుగుతున్నాయని ప్రసాదరావు వివరించారు.