ముందస్తు ఖాయం!: సీఎస్, ఎమ్మెల్యేలతో కేసీఆర్, కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం, ‘శోభకు టికెట్ వద్దు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు త్వరలో అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తాడనే ఊహాగానాలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. సెప్టెంబర్ 2 న జరిగిన ప్రగతి నివేదన సభలో కేసీఆర్ ముందస్తుపై ప్రకటన చేస్తారని అంతా భావించారు. కానీ, ఆయన ఎటువంటి ప్రకటనా చేయలేదు.
ఎమ్మెల్యేలతో మంతనాలు..
అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. ముందస్తు ఎన్నికలపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందని తెలుసుకునేందుకు ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొందని ఎమ్మెల్యేలు కేసీఆర్కు వెల్లడించినట్టు సమాచారం.
Recommended Video
కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం
కేసీఆర్.. గురువారం కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రౌండ్ లెవల్లో పనులు ప్రారంభించాలని కేసీఆర్ సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా, మరో రెండురోజుల్లో ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఉంటుందని కేసీఆర్ తెలిపారు.
అసెంబ్లీ రద్దు ఖాయం..
గురువారం ఎట్టి పరిస్థితులలోనూ తెలంగాణ అసెంబ్లీ రద్దు అవుతుందని టీఆర్ఎస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆలూరి రమేశ్ వ్యాఖ్యానించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గురువారం తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తున్నారు కనుకనే నియోజక వర్గాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. ‘రేపు తెలంగాణ అసెంబ్లీ రద్దు కావడం ఖాయమా?' అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ‘హండ్రెడ్ పర్సెంట్' అని అన్నారు.
సర్వత్రా ఉత్కంఠ
ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం మధ్యాహ్నం జరిగే అవకాశముంది. ఈ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ రద్దుపై కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు సమాచారం. బుధవారం సాయంత్రం ప్రగతి భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమావేశమై ఇదే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగుల మధ్యంతర భృతిపై ఆర్థికశాఖ అధికారుల నుంచి సీఎం నివేదిక తీసుకున్నారు. ఈమేరకు మధ్యంతర భృతిపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రులందరూ గురువారం హైదరాబాద్లో అందుబాటులో ఉండాలని ఇప్పటికే సీఎం కార్యాలయం సమాచారమందించింది. ముందస్తు ఎన్నికలు ఖాయమన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో గురవారం నాటి కేబినెట్ భేటీపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
శోభకు టికెట్ ఇవ్వద్దు..
ఇది ఇలా ఉంటే.. టీఆర్ఎస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గం నాయకుల మధ్య వివాదం రాజుకొంది. ఎమ్మెల్యే బొడిగే శోభకు వ్యతిరేకంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ వద్ద గళం విప్పారు. ఎమ్మెల్యే పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయడం లేదని, అవమానాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బొడిగె శోభకు టికెట్ ఇవ్వొద్దని వారు కేసీఆర్ను కోరారు.