గ్రేటర్ ఎన్నికలు: ఎలక్షన్ కండక్ట్ రూల్స్ మార్చే యోచనలో కెసిఆర్! అటూఇటైనా మజ్లిస్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ (జిహెచ్ఎంసి) ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎన్నికల ప్రక్రియను నెలలోపే పూర్తి చేయాలని భావిస్తోందని తెలుస్తోంది. ఇందుకోసం ఎలక్షన్ కండక్ట్ రూల్స్ మార్చే యోచనలో ప్రభుత్వం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి కౌంటింగ్ వరకు సాధారణంగా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అందులో మినిమం గడువు కూడా ఉంటుంది. ఈ గడువు కాలాన్ని తగ్గించే యోచనలో కెసిఆర్ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం సాయంత్రం ఉత్తర్వులు జారీ కావొచ్చని సమాచారం.
నామినేషన్లు, ప్రచారం గడువు ముగింపును తగ్గించేలా ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది. తద్వారా ఈ నెలలోనే జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఇంకా ఏమైనా మార్పులు చేస్తుందా తెలియాల్సి ఉంది.
కాగా, జిహెచ్ఎంసి పైన గులాబీ జెండా ఎగరాలని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో తెరాస శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ, పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని, కాబట్టి గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీగా టిఆర్ఎస్ ఉండకపోతే అనేక అడ్డంకులు వస్తాయని చెప్పారు.
తెరాస ఒంటరిగానే 75-85 స్థానాలు సాధిస్తుందని, ఒకవేళ అటూ ఇటు ఏమైనా అయినా మజ్లిస్ పార్టీ కూడా కల్సి వస్తుందని, హైదరాబాద్లో ఫీల్గుడ్ వాతావరణం ఉందని కెసిఆర్ చెప్పారని తెలుస్తోంది.
రెండు వారాల్లో...
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ మొత్తం రెండు వారాల్లో పూర్తి చేయాలని ఎన్నికల సంఘాన్ని పార్టీ కోరిందని, ప్రచార సమయం తగ్గితే అవినీతి తగ్గుతుందని, ఒకేసారి మొత్తం వ్యవస్థను మార్చలేమని, కానీ ఆ దిశగా ప్రయత్నిద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది. 23న పోలింగ్ జరిగే అవకాశముందని తెలుస్తోంది.