ఓ వైపు ఆర్టీసీ రూట్ల ప్రవైటీకరణపై కేసీఆర్ కసరత్తు: మరోవైపు సమ్మె ఉధృతం చేస్తున్న అశ్వత్థామ రెడ్డి
హైదరాబాద్: ఓ వైపు ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ సమ్మెను ఉధృతం చేస్తుంటే.. మరో వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన మాట ప్రకారం ముందుకు వెళ్తున్నారు. నవంబర్ 5 లోపు ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించకపోతే ఆర్టీసీ రూట్లను మొత్తం ప్రైవేటుకు అప్పగిస్తామని చెప్పినట్లే చేస్తున్నారు.
రూట్ల ప్రైవేటీకరణపై కేసీఆర్ సమీక్ష..
రూట్ల ప్రైవేటీకరణ అంశంపై సీఎం కేసీఆర్ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రవాణాశాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావు తదితరులు హాజరయ్యారు.
5100 రూట్లు ప్రైవేటుకే..
రాష్ట్రంలోని 5100 రూట్లలో ప్రైవేటు పర్మిట్లపై హైకోర్టులో గురువారం విచారణ జరిగిన విషయం తెలిసిందే. రూట్ పర్మిట్లపై ఇచ్చిన స్టేను సోమవారం వరకు పొడిగించిన హైకోర్టు.. తదుపరి విచారణనను నవంబర్ 18కి వాయిదా వేసింది. కాగా, ఈ సమీక్షలో హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రస్తావించిన అంశాలను అడ్వొకేట్ జనరల్ ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించినట్లు తెలిసింది.
చర్చలు జరపాలి..
ఇది ఇలావుంటే, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ జేఏసీ నేతను మఫ్టీ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సర్కారు.. కోర్టు, ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం చర్చలు జరపాలని కోరుతున్నామని, విలీనం అంశాన్ని తాత్కాలికంగా పక్కపెట్టామని అశ్వత్థామ రెడ్డి చెప్పారు. చనిపోయిన 23 మంది కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆర్టీసీని రక్షించాలంటూ శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.
నిరాహార దీక్ష.. సడక్ బంద్..
హైదరాబాద్లో నవంబర్ 16న తనతోపాటు నలుగురు నిరాహార దీక్ష చేస్తారని అశ్వత్థామ రెడ్డి తెలిపారు. 17,18 తేదీల్లో డిపోల దగ్గర కార్మికుల సామూహిక దీక్షలు చేపడతామని చెప్పారు. 19న హైదరాబాద్ నుంచి కోదాడ వరకు సడక్ బంద్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సడక్ బందక్ కార్యక్రమంలో విద్యార్థులు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలని కోరారు. గవర్నర్ అపాయింట్మెంట్ కోరామని అశ్వత్థామ రెడ్డి తెలిపారు. రేపు, ఎల్లుండి చనిపోయిన కార్మికుల కుటుంబసభ్యులతో గవర్నర్ను కలుస్తామని చెప్పారు. ఎన్హెచ్ఆర్సీ అపాయింట్మెంట్ కూడా కోరామని తెలిపారు.
ఉపాధి కోల్పోవాల్సి వస్తుంది..
ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం పరామర్శించిన దాఖలు లేవని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే బడుగు బలహీన వర్గాలు ఉపాధి అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుందని అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీల్లో అది రుజవవుతోందని అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తాము చేపట్టే అన్ని కార్యక్రమాలకు మద్దతు తెలిపారని, వారికి ధన్యవాదాలని అశ్వత్థామరెడ్డి తెలిపారు.