పిడికిలి బిగించి కరుణానిధి అమర్ రహే అని కేసీఆర్ నినాదం, స్టాలిన్కు ధైర్యం
హైదరాబాద్/చెన్నై: కరుణానిధి మృతి వార్త విని పలువురు డీఎంకే కార్యకర్తల గుండె ఆగింది. దాదాపు చాలామంది మధ్య వయస్సు నుంచి వృద్ధులు చనిపోయారు. కరుణానిధి ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచే పలువురు ఆవేదనకు లోనయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని చాలామంది ఆందోళనకు లోనయ్యారు. మృతి చెందిన విషయం తెలియగానే అది తట్టుకోలేక దాదాపు 17 మంది కన్నుమూశారు.
బుధవారం రాజాజీ హాలులో కరుణానిధిని కడసారి చూసేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, డీఎంకే కార్యకర్తలు భారీగా చెన్నైకి తరలి వచ్చారు. అనంతరం మంగళవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో మెరీనా బీచ్లో అంత్యక్రియలు ముగిశాయి. రాజాజీ హాలులో ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ తదితరులు నివాళులు అర్పించారు.
హైదరాబాద్ నుంచి చెన్నైకి కేసీఆర్
కరుణానిధి పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు హైదరాబాద్ నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ తన కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తదితరులతో కలిసి వచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పీ రాజేశ్వర్ కూడా ఉన్నారు. వారు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి చెన్నైకి చేరుకున్నారు.
అమర్ రహే అంటూ నినాదాలు
రాజాజీ హాలులో ఉంచిన కరుణానిధి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం కేసీఆర్ 'కరుణానిధి అమర్ రహే' అని పిడికిలి బిగించి చేయి పైకెత్తి నినాదం చేశారు. ఆ తర్వాత ఎంకే స్టాలిన్, కనిమొళిలను పరామర్శించారు.
మేమున్నామంటూ ధైర్యం, ప్రభుత్వం తీరును తప్పుబట్టారు
మహానాయకుడిని కోల్పోవడం తమిళనాడుకు, దేశానికి ఎంతో లోటు అని, బాధాకరమని స్టాలిన్తో కేసీఆర్ అన్నారు. ధైర్యం కోల్పోకుండా ఉండాలని, తమంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కరుణానిధి లాంటి మహానాయకుడి అంత్యక్రియలను ప్రభుత్వమే మెరీనా బీచ్లో అనుమతించి నిర్వహించాల్సిందని, కోర్టుకు పోయి అనుమతి తీసుకొనివచ్చేలా వ్యవహరించడం ప్రజలను ఆవేదనకు గురిచేసిందన్నారు.
కనిమొళికి కవిత పరామర్శ
ఈ సందర్భంగా కరుణానిధితో తన గత స్మృతులను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కరుణానిధి కూతురు, ఎంపీ కనిమొళిని ఎంపీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు.
మహారాష్ట్రలో అభిమానుల నివాళి
ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో తమిళ మాధ్యమ పాఠశాల స్థాపనకు 35 ఏళ్ల క్రితం కరుణానిధి భూరి సాయం చేశారని ఆయన అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. కరుణానిధి మృతి నేపథ్యంలో బుధవారం సియోన్ కోలివాడ ప్రాంతంలో సంతాప సభ జరిగింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కెప్టెన్ ఆర్ తమిళ్ సెల్వన్ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.