తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు: పదోన్నతులు, జీతాల పెంపు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు తీపికబురు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సంక్రాంతికి కొద్ది రోజుల ముందే పండగ తీసుకొచ్చారు. నూతన సంవత్సర కానుకగా వేతనాలు, పదవీ విరమణ వయస్సును పెంచుతామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పదోన్నతుల విషయంలోనూ ఉద్యోగులకు శుభవార్త అందించారు.
పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగా నియామకాల ప్రక్రియను చేపడుతామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు, తక్కువ వేతనాలున్న ఆర్టీసీ సిబ్బందికి, ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, గ్రాంట్-ఇన్-ఎయిడ్, వర్క్ ఛార్జ్డ్ ఉద్యోగులకు, దినవేతన, పూర్తిస్థాయి కాంటింజెంట్, పర్ట్ టైం కాంటింజెంట్, సెర్ఫ్ ఉద్యోగులకు పెంపు వర్తిస్తుందని చెప్పారు.
హోంగార్డులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, విద్యా వాలంటీర్ల మాదిరి గౌరవ వేతనాలు అందుకుంటున్న వారందరికీ, పెన్షనర్లకు.. ఇలా అందరికీ పెంపుదల ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులూ కలిసి 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని తెలిపిన విషయం తెలిసిందే.