సరిగ్గా 1.25 గం.కు.. కేసీఆర్ అనే నేను.. రెండోసారి తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణం, మంత్రిగా అలీ
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గరువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మధ్యాహ్నం గం.1.25 నిమిషాలకు తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 2014లో ఉమ్మడి ఏపీలో ఎన్నికలు జరగగా.. నాడు విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి సీఎంగా ప్రమాణం చేశారు. ఇప్పుడు రెండోసారి. రాజ్ భవన్లో కేసీఆర్ ప్రమాణ స్వీకారం జరిగింది. గవర్నర్ ప్రమాణం చేయించారు.
కేసీఆర్తో ఒక్కరే మంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మహమూద్ అలీ ప్రమాణం చేశారు. ఆయన గత ప్రభుత్వంలో కేసీఆర్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. కేసీఆర్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆయనతో పాటు ఓ మంత్రి ప్రమాణం చేస్తారని ప్రచారం జరిగింది. చివరకు ఓ మంత్రితో పాటు కేసీఆర్ ప్రమాణం స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారానికి ముందు కుటుంబ సభ్యులతో సహా రావాలని మహమూద్ అలీకి ఆహ్వానం అందింది. దీంతో కేసీఆర్తో పాటు ఆయన ప్రమాణం చేస్తారని భావించారు. కాగా, ఈ నెల 18న మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. అదే రోజు మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ ఉండే అవకాశముంది.
'కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధిరాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గానీ పక్షపాతం గానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను'. అని కేసీఆర్ ప్రమాణం చేశారు.
తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2014 జూన్ 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు ఆయనతో పాటు పదకొండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కేబినెట్ను విస్తరించారు. ఈసారి కేసీఆర్తో పాటు మహమూద్ అలీ ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేశారు. తొలిసారి 11మంది ప్రమాణం చేసినప్పుడు కూడా వారిలో మహమూద్ అలీ ఉన్నారు.
Telangana: #Visuals from Raj Bhavan in Hyderabad; K Chandrasekhar Rao will take oath as the Chief Minister today pic.twitter.com/Dt8KDH7bb4
— ANI (@ANI) December 13, 2018