రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేస్తా, నిర్లక్ష్యం వహిస్తే చర్యలే: సీఎం కేసీఆర్ హెచ్చిరకలు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా జూన్ 19 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేసి పంచాయతీరాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలిస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి అమలుపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జూన్ 13న జిల్లాల అదనపు కలెక్టర్లు, డీపీవోలతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ముందస్తు ప్రణాళిక సంస్కృతిని అన్ని శాఖల యంత్రాంగం అభివృద్ధి చేయాలని, ఇందులో భాగంగా సీజనల్ వ్యాధుల కట్టడికి అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 4.7 శాతానికి పడిపోయిందన్నారు.
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత, త్వరలో మరో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపడుతామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణను కొనసాగించాలని సీఎం ఆదేశించారు.
నూతన పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ చట్టాలను అమల్లోకి తెచ్చి పల్లెలు, పట్టణాల అభివృద్దికి దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం సహకారం అందిస్తున్నదని సీఎం తెలిపారు. గ్రామాలకు, మున్సిపాలిటీలకు ఆర్థికంగా అండదండలందిస్తూ ఉద్యోగుల భర్తీ చేపట్టి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నదన్నారు. ప్రతినెలా గ్రామాల అభివృద్ధికోసం, రూ. 339 కోట్లు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 148 కోట్ల రూపాయలను క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నదన్నారు.
నిర్దేశిత బాధ్యతలను నిర్వర్తించడంలో పంచాయతీ రాజ్ ఉద్యోగులు, అధికారులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో తెలుసుకోవాల్సి ఉందని సీఎం అన్నారు. తాత్సారం జరిగినట్టు, నిర్లక్ష్యంతో వ్యవహరించినట్టు తన పర్యటనలో గుర్తిస్తే.. ఎవరినీ క్షమించబోనని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటివరకు గ్రామాలు, మున్సిపాలిటీలల్లో ఎంత వరకు ఏమేమి పనులు జరిగాయో ఒక చార్టును రూపొందించాలని సీఎస్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పల్లె ప్రగతి చార్టును, పట్టణ ప్రగతి చార్టును వేరు వేరుగా రూపొందించాలన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఎ.జీవన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.