నేడు దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
గత రెండు రోజులుగా జిల్లాల్లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం(జూన్ 22) యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ది పనులను పరిశీలించనున్న సీఎం... గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. ఇటీవలే వాసాలమర్రి సర్పంచ్కు స్వయంగా ఫోన్ చేసిన సీఎం కేసీఆర్... గ్రామంలో పర్యటించబోతున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే.
సీఎం రాక నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేవలం వాసాలమర్రి గ్రామస్తులే సీఎం సభలో పాల్గొనేలా ప్రత్యేక పాస్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు.
గతేడాది కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.అప్పట్లో జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక ప్రారంభోత్సవాన్ని ముగించుకుని ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుండగా వాసాలమర్రిలో ఆగారు. ఆ సమయంలో గ్రామస్తులతో మాట్లాడి అక్కడి సమస్యల గురించి తెలుసుకున్నారు. అనంతరం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రూ.50 కోట్లు నుంచి రూ.100 కోట్లతో గ్రామాన్ని అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ అప్పట్లో గ్రామాన్ని సందర్శించి స్వయంగా గ్రామస్తులతో మాట్లాడి అక్కడ ఏయే సదుపాయాలో కల్పించాలో ఒక ప్రణాళిక రూపొందించారు. ఆ మేరకు అక్కడ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. సీఎం తాజా పర్యటనలో వాటిని పరిశీలించనున్నారు. వాసాలమర్రిని ఎర్రవెల్లి,అంకాపూర్ తరహాలో తీర్చిదిద్దుతామని గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్... చెప్పినట్లుగానే గ్రామాన్ని అభివృద్ది చేయడంతో గ్రామస్తులు సంతోషిస్తున్నారు. కేసీఆర్ పర్యటనలో గ్రామానికి మరిన్ని వరాలు కురిపిస్తారని ఆశిస్తున్నారు.
Recommended Video
గత రెండు రోజులుగా సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం(జూన్ 20) సిద్దిపేట,కామారెడ్డి జిల్లాల్లో పర్యటించిన సీఎం... సోమవారం(జూన్ 21) వరంగల్ జిల్లాలో పర్యటించారు. సిద్దిపేట,కామారెడ్డి,వరంగల్ జిల్లా కేంద్రాల్లో నూతన కలెక్టరేట్ భవనాలను ప్రారంభించారు. సిద్దిపేటలో నూతన పోలీస్ కమిషనరేట్ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. వరంగల్ పర్యటనలో జిల్లా కలెక్టరేట్తో పాటు ఆరోగ్య విశ్వ విద్యాలయ నూతన భవనాలను ప్రారంభించారు.వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండగా మార్పుస్తున్నామని ప్రకటించారు. జిల్లాకు వెటర్నరీ,డెంటల్ కాలేజీలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.