కేసీఆర్ టెంపుల్ రన్: రామేశ్వరంలో ఆలయాల సందర్శన: సముద్రం ఒడ్డున..సేద తీరిన సీఎం
చెన్నై: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రామేశ్వరంలో పర్యటిస్తున్నారు. ఆయన వెంట భార్య, కుమారుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కోడలు, మనవడు ఉన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని యూపీఏ, ఎన్డీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఆయన ప్రస్తుతం తలమునకలై ఉన్నారు. ఇందులో భాగంగా- ఇటీవలే కేరళకు వెళ్లారు. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్తో సమావేశం అయ్యారు. అంతకుముందు కూడా- ఆయన రాజధాని తిరువనంతపురంలోని ప్రఖ్యాత అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.
సముద్రం ఒడ్డున సేద తీరిన సీఎం
తిరువనంతపురం నుంచి నేరుగా ఆయన రామేశ్వరం చేరుకున్నారు. అక్కడి అతిథిగృహంలో కొద్దిసేపు బస చేశారు. అనంతరం ధనుష్కోటి ఆలయానికి వెళ్లారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్, ఆయన కుటుంబానికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ హిందూ మహాసముద్రం ఒడ్డున గడిపారు. అక్కడి నుంచి రామసేతు వద్దకు వెళ్లారు. రామసేతు సమీపంలోని పంచముఖి హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మంలి ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు రోజే కేసీఆర్.. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సమాధిని కూడా సందర్శించారు.
కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు..కేసీఆర్ కు చెక్
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా పినరయి విజయన్తో సమావేశాన్ని ముగించుకున్న అనంతరం ఆయన డీఎంకే అధినేత స్టాలిన్ను కలుసుకోవాల్సి ఉంది. కేసీఆర్-స్టాలిన్ల భేటీ ఉంటుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. లోక్సభ ఎన్నికల సందర్భంగా స్టాలిన్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా కుదిరింది. సీట్ల సర్దుబాటులో భాగంగా- మొత్తం 39 లోక్సభ స్థానాలు ఉన్న తమిళనాడులో కాంగ్రెస్కు 10 స్థానాలను అప్పగించింది స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే. నిజానికి ఈ నెల 12వ తేదీన అంటే ఆదివారం చెన్నైలో స్టాలిన్ తో కేసీఆర్ సమావేశం కావాల్సి ఉంది.
ఫలితాల తరువాతే..
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ను కాదని స్టాలిన్ గానీ, ఆయన పార్టీ సీనియర్ నేతలు గానీ కేసీఆర్ వెంట నడుస్తారా? అనేది అనుమానాస్పదమే. కేసీఆర్ ఏర్పాటు చేయదలచుకున్న ఫెడరల్ ఫ్రంట్లో చేరడానికి డీఎంకే నేతలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారనే విషయం తమిళనాడులో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్తో పొత్తు వ్యవహారం బెడిసి కొట్టి, ఎన్నికల ఫలితాలు గనక ప్రతికూలంగా వస్తే- ఫెడరల్ ఫ్రంట్లో చేరడానికి మొగ్గు చూపవచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ పరిస్థితుల్లో కేసీఆర్-స్టాలిన్లు సమావేశం అవుతారా? లేదా? అనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. ఒక్కసారి కేసీఆర్తో భేటీ అంటూ ఉంటే.. కాంగ్రెస్కు దూరం కావాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చనేది డీఎంకే పార్టీకి చెందిన సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.