నోట్ల రద్దుతో భారీ నష్టమే!: కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయాలు..
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారిగా ప్రగతి భవన్ లో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: ప్రభుత్వం అంటే కేవలం నిధుల మంజూరు చేపట్టడమే కాదని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. డబ్బులతోనే అన్ని పనులు సాధ్యపడవని ప్రజా జీవితాల్లో మార్పు తెచ్చే పథకాలను, మంచి పాలసీలను తీసుకురావాలని ఆకాంక్షించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తొలిసారిగా నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సంక్షేమ రంగంలో తెలంగాణ ప్రభుత్వం రూ.30వేల కోట్లకుపైగా ఖర్చు పెడుతోందని చెప్పుకొచ్చారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలతో రాష్ట్రంలో సగటున 4లక్షల కుటుంబాలకు ఒక జిల్లా ఉన్నందునా.. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువవుతాయని కేసీఆర్ తెలిపారు. టీఎస్ఐపాస్ చట్టంతో రాష్ట్రానికి కొత్తగా 2500 పరిశ్రమలు వచ్చాయన్నారు.
ఇక కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంపై భారీగానే ఉంటుందని కేసీఆర్ పేర్కొనడం గమనార్హం. నగదు రహిత లావాదేవీలను ప్రజలకు వివరించాలని, క్యాష్లెస్ లావాదేవీలను ప్రోత్సహించాలని సమావేశంలో కేసీఆర్ కలెక్టర్లకు సూచించారు.
కీలక నిర్ణయాలు:
ప్రగతి భవన్ లో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టర్లకు ఇప్పటివరకు కేటాయిస్తూ వస్తున్న నిధికి తోడు అదనంగా రూ.3కోట్ల అత్యవసర నిధిని అందజేయనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.
ఈ మేరకు .93 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసర పనుల కోసం ఈ నిధిని ఉపయోగించుకోవాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. అలాగే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా), హెచ్ఎండీఏ పరిధిలోని సాదాబైనామాలను ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారు.