కొత్తకోణం: ఉద్యోగాల పేరిట రూ.40 లక్షలు వసూలు.. సీఎం పేషీ అధికారుల హస్తం?
నల్గొండ జిల్లాలో సతీష్ రెడ్డి అనే యువకుడి ఆత్మహత్యా యత్నానికి సీఎం పేషీ అధికారులే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇంటిలిజెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగారు.
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో సతీష్ రెడ్డి అనే యువకుడి ఆత్మహత్యా యత్నం సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సీఎం పేషీ అధికారులే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అసలేం జరిగిందో తేల్చేందుకు ఇంటిలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు.
నల్గొండ జిల్లాకు చెందిన వడ్డె సతీష్ రెడ్డి ఆత్మహత్యా యత్నం కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సతీష్ రెడ్డితో పాటు మరో ఎనిమిది మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. సీఎం పేషీలో పని చేస్తున్న ఇద్దరు అధికారులు రూ. 40 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
డబ్బు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వకపోగా ఐపీ నోటీసులు ఇచ్చారని, దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సతీష్ రెడ్డి ఆత్మహత్యా యత్నం చేశాడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సీఎం పేషీలోని అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తడంతో అసలు ఏం జరిగిందో తేల్చేందుకు ఇంటిలిజెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగారు.
ఈ ఘటనలో అధికారుల పాత్ర ఉందో, లేదో ఆరా తీస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సతీష్ రెడ్డిని కూడా అధికారులు విచారించారు. అసలు డబ్బులు ఎవరికిచ్చారన్న కోణంలో విచారణ జరిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.